నిత్యం ఏదో ఓ ప్రాంతంలో ప్రేమ పేరుతో ఆడపిల్లలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమిస్తే ఒకలా మోసం చేయడం, ప్రేమించకుంటే మరోలా వేధింపులకు గురిచేయడం చేస్తున్నారు కొందరు మానవ మృగాలు. ఇప్పటికే ఎంతో మంది అమాయకపు యువతులు ప్రేమ వేధింపులకు బలయ్యారు. తాజాగా విజయనగరం జిల్లాలో కూడా ఓ యువతి ప్రేమ వేధింపులకు బలైంది.
ఈమధ్యకాలంలో ఆడపిల్లలకు రక్షణ అనేది కరువైంది. మహిళలు, ఆడపిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్ట తెచ్చిన అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా స్నేహభావంతో మాట్లాడే ఆడపిల్లలను ప్రేమ పేరుతో కొందరు యువకులు వేధిస్తుంటారు. మేక వన్నె పులిలాగా అప్పటి వరకు ఎంతో అమాయకంగా కనిపించే యువకుడు.. తన ప్రేమను ఒప్పుకోకపోతే.. మృగంలా మారిపోతాడు. అంతకముందు వరకు తనతో చనువుగా ఉన్న ఫోటోలు బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతుంటారు. దీంతో ఇంట్లో చెప్పుకోలేక, ఆ మానవ మృగాల వేధింపులు భరించలేక ఎందరో ఆడపిల్లలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోనూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
విజయనగరం జిల్లా జామి మండలం వెన్నె గ్రామానికి చెందిన యువకుడు కోటిబాబు కొత్త భీమసింగిలో సెల్ పాయింట్ నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే ఆ షాప్ లో బి.జగదీశ్వరి(22) అనే యువతిని పనిలో పెట్టుకున్నాడు. ఆమె చిన్నతనంలోనే తండ్రి లక్ష్మినారాయణ మరణించాడు. ఇక అప్పటి నుంచి ఆమె తల్లి.. ముగ్గురు ఆడ బిడ్డలను అల్లారు ముద్దుగా చూసుకుంటుంది. కుటుంబానికి ఆర్థికగా తోడు ఉండేందుకు జగదీశ్వరి సెల్ షాపు లో పని వెళ్లేది. ఈక్రమంలో మొదట్లో కోటిబాబు ఎంతో మంచితనంగా ఆ అమ్మాయి ముందు నటించేవాడంట.
అలా కొంతకాలం గడిచిన తరువాత ఆ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని అతను వేధించేవాడు. ఆమె నిరాకరించి, అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వారు మూడునెలల క్రితం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలానే పోలీసులు అతడి అదుపులోకి తీసుకుని గట్టిగా హెచ్చరించారు. ఆ యువతి జోలికి వెళ్లనని గ్రామస్థులు, పోలీసులు సమక్షంలో కోటిబాబు రాతపూర్వకంగా ఒప్పుకున్నాడు. అలా కొంతకాలం అతడి వేధింపులు ఆగిపోయాయి. అయితే ఇటీవలే మూడు రోజుల నుంచి మళ్లీ ఆ యువతిని వేధించడం మొదలు పెట్టాడు. వివిధ ఫోన్ల ద్వారా మెసేజ్ లు పంపించే వాడు. పెళ్లి చేసుకోకపోతే.. తన వద్ద ఉన్న వీడియోలు బయట పెడతానని బెదిరించడంట.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన జగదీశ్వరి.. శుక్రవారం సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లింది. అనంతరం అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. అటుగా వెళ్తున్న వాళ్లు జగదీశ్వరి మృతదేహం చూసి సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జగదీశ్వరి మరణవార్త తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధించారు. కోటిబాబు, అతని చెల్లెలు, బావ వేధింపులతోనే జగదీశ్వరి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి… ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.