మన్యం ప్రాంతంలో ఓ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆస్పత్రికి తరలించేందుకు సిద్దమయ్యారు. కానీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడి గిరిజనులు పాప ప్రాణాలను కాపాడేందుకు ఓ సాహసం చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. అనారోగ్యం భారిన పడిన వారిని, గర్భిణి మహిళలను డోలీలో మెసుకుంటూ ఆస్పత్రులకు తరలిస్తుంటారు. అలా కొన్ని కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ తీసుకెళతారు. గిరిజనుల గ్రామాల్లో రహదారి సౌకర్యాలు లేక ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాగే ఓ చిన్నారి అనారోగ్యానికి గురైనందున ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ మధ్య కురిసిన వానల కారణంగా అక్కడి ప్రాంతంలో ఉన్న నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మన్యం వాసులు ఓ సాహసం చేశారు. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కొమరాడ మండలం రెబ్బకు చెందిన సోమేష్, చంద్రమ్మ దంపతులు నివాసముంటున్నారు. వారికి ఏడేళ్ల కూతురు ఉంది. ఆ అమ్మాయి రెండు రోజుల నుండి తీవ్రంగా జ్వరంతో బాధపడుతుంది. స్థానికంగా వైద్యుని అందిస్తున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. పాపకు ఆరోగ్యం మెరుగు పరుచుటకు రెబ్బ నుండి ఒడిశా రాయగడలోని ఆస్పత్రికి తరలించాలని అనుకున్నారు. కానీ నాగావళి నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నది దాటడం ప్రమాదకరమని భావించారు. కానీ పాప తండ్రి సోమేష్ తోటి గిరిజనుల సాయంతో వెదురు బొంగులతో చిన్న తెప్పను తయారుచేశాడు. దానిపై పాపను, భార్యను తీసుకొని తెప్పమీద నది దాటారు.
నది ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నాకూడా పాప ప్రాణాలను కాపాడేందుకు సాహసం చేశారు. అవతలి ఒడ్డుకు క్షేమంగా చేరి అక్కడి నుండి 17 కిలో మీటర్ల దూరం నడిచి ఒడిశాలోని రాయడగ ఆస్పత్రిలో చిన్నారిని చేర్పించారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.