రాష్ట్ర మొత్తం అధికార పార్టీ ఫ్యాన్ గాలి వీస్తుంటే ప్రకాశంజిల్లా దర్శిలో అనుహ్యంగా టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. దర్శి నగర పంచాయతీగా ఏర్పడిన తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. దర్శి నగర పంచాయాతీలో మొత్తం 20 వార్డులకు గాను 13 వార్డుల్లో తెదేపా గెలుపొందగా, అధికార పార్టీ వైసీపీ 7వార్డులు మాత్రమే దక్కించుకుంది. దీంతో తెదేపా అధిష్టానం ముందుగానే ప్రకటించిన11వ వార్డులో పోటీచేసిన నారపుశెట్టి పిచ్చయ్య తొలి నగర పంచాయతీ ఛైర్మన్గా ఎన్నిక కానున్నారు.
వైఎస్సార్ సీపీ ఓటమికి ఐదు కారణాలు:
1) వైసీపీ నాయకుల ఓవర్ కాన్ఫిడెన్స్
రాష్ర్టంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగిన అధికార వైసీపీ విజయకేతనం ఎగురవేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బద్వేల్ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో విజయం సాధించటంతో ఇక్కడ కూడా ఖచ్చితంగా గెలుస్తాం అనే స్థానిక నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్. దర్శిలో వైసీపీకి ఓటమికి ఒక కారణం.
2) తమ సాంప్రదాయ ఓటింగ్ ను కాపాడుకున్నటీడీపీ
1952 దర్శి నియోజకవర్గం ఏర్పడగా అనేక పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. 1983 టీడీపీ తరపున పోటీ చేసిన కస్తూరి నారయణ స్వామి గెలిచారు. 1983 నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 4 సార్లు విజయం సాధించింది. అప్పటి నుంచి అక్కడ టీడీపీ కి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఎన్నికలో ఆ సాంప్రదాయ ఓటు బ్యాంక్ కాపాడుకోవడంలో టీడీపీ వ్యూహం ఫలించింది. ఇది వైసీపీ ఓటమికి మరో కారణం.
3) టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులపై పనిచేసిన సింపతి
2014 టీడీపీ తరపున గెలిచి మంత్రిగా పనిచేసిన శిద్ధ రాఘవరావు, 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందటంతో పార్టీ ఫిరాయించారు. శిద్ధా రాఘవరావు పార్టీని వీడటంతో ఆయన్నే నమ్ముకున్న స్థానిక ద్వితీయ శ్రేణి నాయకులు ఒంటరైనారు. బలమైన రాఘవరావు పార్టీ మారటంతో స్థానిక నాయకులపై ప్రజల్లో సింపతి ఏర్పడింది. అంతేకాకుండా టీడీపీకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామిలు టీడీపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేశారు. టీడీపీ ఎమ్మెల్యేల టీమ్ వర్క్ దర్శి నగర పంచాయతీపై పసుపు జెండా ఎగిరేలా చేసింది. ఇది కూడా ఒక రకంగా వైసీపీ ఓటమికి కారణం.
4) వైసీపీ పెద్ద నేతలు అందరూ కుప్పం పై ఫోకస్
కుప్పం మున్సిపాలిటీని ఎలాగైన కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పెద్ద నేతలు అందరూ కప్పంలో వాలిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రరారెడ్డితో పాటు మరికొంత మంది మత్రులు, పెద్ద నాయకులు అందరు కుప్పంలో ప్రచారం చేశారు. దర్శిలో ప్రచారంపై నిర్లక్ష్యం చేయడం వైసీపీ ఓటమికి మరో కారణం భావించవొచ్చు.
5) స్థానికంగా పార్టీలో అంతర్గత పోరు
దర్శి వైసీపీలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీ కొంపముంచిందని స్థానికులు అనుకుంటున్నట్లు సమాచారం. దర్శి వైసీపీలో వర్గపోరును టీడీపీ క్యాష్ చేసుకుంది. దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు తమ్ముడు పిచ్చయ్యను వ్యూహాత్మకంగా పోటీ చేయించి విజయం సొంతం చేసుకుంది.