ప్రజలను రక్షించవలసిన రక్షకభటులే లంచాలు డిమాండ్ చేస్తున్నారు. సమాజాన్ని కాపాడవలసిన పోలీసులే దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో లంచావతారమెత్తిన ఎస్పై దీపిక, కానిస్టేబుల్ నరసింహను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అంటే ప్రజల ధన, ప్రాణాలను రక్షించేవారు. ప్రజలను కాపాడవలసిన పోలీసులే అడ్డదారులు తొక్కుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏం కావాలి..? ఏ పని కావాలన్నా లంచం ఇచ్చుకోవాలి. లంచం లేనిదే ఏ పని జరగదు. లంచానికి ఆశపడి ఏసీబీకి చిక్కిన పోలీసుల నిర్వాకం ప్రకాశం జిల్లాలో నెలకొంది. ఓ ఘర్షణ కేసులో నిందితుల పేర్లు లేకుండా చేయాలంటే లంచం అడిగారు ఓ కానిస్టేబుల్, ఓ మహిళా ఎస్సై. రూ.45 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్లలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ పి. శ్రీనివాసులు తెలిపిన ప్రకారం..
ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్ల లో జల్లి చిన్నచెన్నయ్య, అంజలి భార్యాభర్తలు నివాసముంటున్నారు. మే నెల 20న దంపతుల మధ్య గొడవ జరిగింది. మధ్యవర్తిగా గొట్టిముక్కల నరసింహులు సర్ధిచెప్పారు. చెన్నయ్య తన భార్యను కొట్టడంతో గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజలి తన భర్తతోపాటు గొట్టిముక్కల నరసింహారావు మరో ఇద్దరిపై కేసు పెట్టింది. ఎస్సై దీపిక విచారణ అనంతరం రిమాండ్కు పంపింది. మిగిలిన వ్యక్తులకు కేసుతో సంబంధం లేదని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. అయితే కేసులో ఉన్న ముగ్గురి పేర్లు తీసేయాలంటే రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యవర్తి ద్వారా రూ. 45 వేలకు బేరం కుదుర్చుకున్నారు.
లంచం ఇవ్వడం గొట్టిముక్కల నరసింహకు ఇష్టం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గొట్టిముక్కల నరసింహులు.. కానిస్టేబుల్ నరసింహకు రూ.45 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై దీపికను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.