టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీని మళ్లీ బలోపేతం చేసుకోవడం.. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కించుకోవాలన్నది చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు వైసీపీపై రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయడంతో పాటు టీడీపీని బలోపేతం చేసుకోవడంలో 2022 ఎంతో కీలకమని చంద్రబాబు పార్టీ నేతలకు చెబుతున్నారు.
ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా శనివారం ఉదయం కుప్పం నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని నమ్ముకొని నా పరువు పోగొట్టుకున్నా. నాయకుడు వచ్చినపుడు మాత్రమే షో చూపించవొద్దని.. మీరు చేస్తున్న పనుల వల్లే ప్రజలు మనకు దూరమవుతున్నారు. ప్రజా నమ్మకాన్ని సంపాదించి ప్రజల్లో ఉన్న నాయకులనే నేను ప్రోత్సహిస్తాను అన్నారు. ఎక్కువ సమయాన్ని కుప్పంలోనే గడుపుతానని.. క్షేత్ర స్థాయి పర్యటనలతో పార్టీ బలోపేతానికి స్వయంగా రంగంలో దిగుతానని స్పష్టం చేశారు. ఒకప్పుడు క్రియాశీలంగా పనిచేసిన వారందరూ ఇప్పుడు ధైర్యం కోల్పోయారన్నారని అసహనం వ్యక్తం చేశారు. తన బొమ్మ పెట్టుకొని.. తన పేరు చెప్పుకొని పబ్బం గడుపుతన్నారే తప్ప మీకు మీరుగా ప్రజల్లోకి వెళ్లి వారి నమ్మకాన్ని సంపాదించలేకపోవడం కారణంగానే వైఫల్యం చెందుతున్నామని అన్నారు.
ఇది చదవండి : విజయవాడలో విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య!
కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు. కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటానని.. అది కూడా పది నెలల్లోపే జరుగుతుందని చెప్పారు. తరుచూ కుప్పానికి వస్తానని.. వారం పది రోజులపాటు ఉంటానని.. తొలుత ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎలా తిరిగానో,అలాగే నియోజకవర్గంలోని గ్రామగ్రామానా పర్యటించి, కేడర్తో పాటు ప్రజలనూ కలుస్తానన్నారు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని.. ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు.