బెండపూడి.. బెండపూడి.. గత కొన్ని రోజులుగా ఆ ప్రభుత్వ పాఠశాల పేరు మారుమోగిపోతుంది. అమలాపురం టూ అమెరికా వరకు ఈ ప్రభుత్వ పాఠశాల గొప్పతనం తెలిసింది. కొన్ని నెలల క్రితం వరకు ఈ పాఠశాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. కానీ ఈ స్కూల్కి చెందిన కొందరు విద్యార్థులతో సీఎం జగన్ స్వయంగా భేటీ అయ్యి.. వారితో మాట్లాడి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు.. ఇంగ్లీష్లో అది కూడా అమెరికన్ యాక్సెంట్లో అదరగొట్టారు. వీరి టాలెంట్ను చూసిన సీఎం జగన్.. మనస్ఫూర్తిగా ఆ విద్యార్థులను మెచ్చుకుని ప్రశంసలు కురిపించారు.
కానీ కొందరు మాత్రం.. దీనికి రాజకీయ రంగు పూసి అభం శుభం తెలియని చిన్నారులపై దారుణమైన ట్రోలింగ్ చేశారు. ఆ పసి హృదయాలు ఎంత బాధపడతాయో కదా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఆ పిల్లల స్థానంలో మన పిల్లలుంటే.. ఎంత ముచ్చడపడేవాళ్లమో కదా. ఇంత చిన్న ఇంగితాన్ని మర్చిపోయి ఆ చిన్నారులను దారుణంగా ట్రోల్ చేసి.. వారికి తీరని మనో వేదన మిగిల్చారు. సరే ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంత చక్కగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారు.. అసలు బెండపూడి స్కూల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసింది సుమన్ టీవీ. ఆ వివరాలు..
ఇంగ్లీష్.. ఆ పేరు వినగానే చాలా మంది భయపడతారు. మన ముందు ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం అవుతుంది.. కానీ మాట్లాడలేం. ఒకవేళ మాట్లాడినా తప్పులు వస్తాయేమో అని భయపడతాం. దాంతో అసలు నోరు విప్పం. ఇదిగో ఈ భయాన్ని అధిగమిస్తే చాలు.. ఇంగ్లీష్లో విజృంభించొచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బెండపూడి స్కూల్ టీచర్స్.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
ముందు ధైర్యంగా మాట్లాడమని విద్యార్థులకు సూచించారు. తప్పొప్పుల సంగతి పక్కకు పెడితే.. ముందు నోరు విప్పి మాట్లాడాలి. ఆ తర్వాత తప్పులను సరి చేసుకుంటూ వెళ్తే.. కొన్ని రోజులకు సెట్ అవుతుంది. దీన్నే ఆచరణలో పెడుతున్నారు బెండపూడి పాఠశాల విద్యార్థులు, టీచర్లు. అలానే అమెరికన్ యాక్సెంట్లో ఏ పదాన్ని ఎలా పలకాలో విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు టీచర్లు. ఇక స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ప్రత్యేకంగా రోజుకు రెండు గంటలు కేటాయిస్తున్నారు. ఇలా విద్యార్థుల భవిష్యత్తు కోసం బెండపూడి స్కూల్ టీచర్లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో.. ప్రస్తుతం జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా ఈ పద్దతిని అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక సీఎం జగన్ కూడా దీన్ని ఎస్ఓపీ చేయమని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 5 పాఠశాలల్లో ఈ మోడల్ని ప్రవేశపెట్టారు. దీని ఫలితాలను బట్టి భవిష్యత్తులో మరిన్ని పాఠశాలలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు.
ఇక ఈ మోడల్ని తమ ప్రాంతాల్లో అమలు చేయడం కోసం వేర్వేరు రాష్ట్రాల నుంచి అధికారులు బెండపూడి పాఠశాలకు వచ్చి పరిశీలించి వెళ్తున్నారు. ఇక్కడి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడిన వీడియోలు వైరల్ కావడంతో.. మన దేశంలోనే కాక చాలా మంది విదేశాల నుంచి తమకు కాల్ చేసి ప్రశంసలు కురిపిస్తున్నారని టీచర్లు తెలిపారు.