కార్పోరేట్ పాఠశాలల్లో విద్యార్థులను తరలించడానికి బస్సులను ఏర్పాటు చేస్తారు ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రభుత్వ స్కూల్ లో మొదటిసారిగా స్కూల్ బస్సు అందుబాటులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విద్యా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. తమ పిల్లలకు మంచి విద్యనందించి భవిష్యత్తులో ఉన్నత స్థితిలో స్థిరపడే విధంగా తల్లిదండ్రులు కాయాకష్టం చేసి చదివిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాయి. ప్రభుత్వానికి తోడు దాతలు కూడా ముందుకొచ్చి పాఠశాలల అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మాజీ సర్పంచ్ ప్రభుత్వ పాఠశాలకు స్కూల్ బస్సును అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. దీంతో ఆ స్కూలుకు కొత్త శోభ సంతరించుకుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తుంది ప్రభుత్వం. నాణ్యమైన విద్యనందించేందుకు కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునికమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ క్లాస్ విధానాలను అమల్లోకి తీసుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే తాజాగా మొదటిసారి ప్రభుత్వ స్కూలుకు బస్సు సౌకర్యం వచ్చింది. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేటకు చెందిన మాజీ సర్పంచ్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అక్కంపేట జడ్పీ హైస్కూల్ కు లక్షలు విలువ చేసే బస్సును విరాళంగా ఇచ్చారు. తన తండ్రి నారపరెడ్డి సీతారామిరెడ్డి పేరు మీద ట్రస్టు ఏర్పాటు చేసి గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే రూ. 25 లక్షలు వెచ్చించి అక్కం పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించారు. అంతే కాకుండా దాని నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా చెల్లించాడు. ఇక ఈ సౌకర్యంతో సుదూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ప్రయాణ ఇబ్బందులు తప్పుతాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిలో దాతలు ముందుకు వస్తే మరిన్ని స్కూల్స్ లో బస్సు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పలువురు కోరుతున్నారు.