ఏపీలో రాజకీయ నాయకుల మధ్య చోటుచేసుకుంటున్న వ్యక్తిగత విమర్శలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీని ఉద్దేశిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంటుంది. ఏపీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నామని అధికార పార్టీ నాయకులు చెప్తుంటే, ప్రతిపక్షాలేమో వారికి విరుద్ధంగా ఏపీని అప్పుల పాలు చేస్తున్నారని, పరిశ్రమల స్థాపన లేదు యువతకు ఉద్యోగ కల్పన లేదు, ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలకు కూడా విఘాతం కల్పిస్తున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ అభివృద్దే లక్ష్యంగా, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీని నెలకొల్పి రాజకీయ పార్టీలకు సవాల్ విసురుతున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టి ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఈ క్రమంలో పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జనసేన అధినేత పేదలకు ఏ కష్టం వచ్చినా స్పందిస్తూ వారికి సాయపడుతూ భరోసా కల్పిస్తున్నారు. కాగా ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కట్టుబడి ఉన్నానని, రాష్ట్రం కోసం జైలుకు వెళ్లడానికి, దెబ్బలు తినేందుకు సైతం వెనకాడనని చెప్పారు. నాకు వ్యక్తిగతంగా ఎవ్వరిపైనా ద్వేశం లేదని ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతున్నానని ఆయన అన్నారు. దీనిని జీర్ణించుకోలేని కొందరు నాపై విమర్శలకు దిగుతున్నారని పవన్ తెలిపారు. నేను చేసే ఈ పోరాటంలో మీరు నన్న చిత్రహింసలు పెట్టినా, అరెస్టులకు పాల్పడినా నేను రెడీగా ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేసులకు భయపడే వ్యక్తిని అయితే పార్టీ ఎందుకు పెడతాను. సమాజంలో మార్పు తెచ్చే అధికారం కావాలని కోరుకుంటున్నా. ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను. ప్రజలకు మేలు జరగాలి ఏపీ భవిష్యత్తు బాగుండాలనేదే నా కోరిక అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.