ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులు వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని మరోసారి చూడరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల కొందరు నాయకులు చేస్తున్న వ్యాఖ్యల మీద పవన్ స్పందించారు. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొట్టేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొడతామంటే చూస్తూ ఊరుకోమని.. ఇంకోసారి విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతామన్నారు. మీ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా స్టేట్మెంట్లు ఇవ్వొద్దన్నారు.
రాష్ట్రాన్ని, ప్రజల్ని విడగొట్టింది చాలని.. ఇక ఆపేయండని పవన్ పేర్కొన్నారు. పిచ్చి నాయకులు, ముసలి నేతల మాటలు పట్టించుకోవదన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కుల పిచ్చి ఉందన్న పవన్.. ముఖ్యమంత్రి మా వాడని ఓటు వేస్తే ఎలా అని క్వశ్చన్ చేశారు. జగన్ టీనేజ్లో ఉన్నప్పుడు కడపలోని పులివెందులలో ఒక ఎస్సైని జైల్లో పెట్టి కొట్టిన ఘనత ఉందన్నారు. అలాంటి జగన్ చేతుల్లోనే ఇప్పుడు శాంతిభద్రతలు ఉన్నాయని పవన్ కామెంట్స్ చేశారు. ప్రజలు అనుకుంటే తాను సీఎం అవుతానని జనసేనాని చెప్పుకొచ్చారు. రిపబ్లిక్ డే ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావనను పవన్ తీసుకొచ్చారు. తెలంగాణ యువత, ప్రజల్లో ఉన్న చైతన్యం ఏపీ ప్రజల్లోనూ ఉంటే బాగుండేదన్నారు.