తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రజా శాంతి అధ్యక్షులు కేఏ పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రాజకీయ నేతలపై విమర్శలు, వెటకారాలు, రోడ్లపై నానా హంగామా సృష్టిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీ తమ పరిపాలనలో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేశామని.. మరోసారి ఛాన్స్ ఇస్తే ఏపిని అభివృద్ది పథంలో ముందుకు తీసుకు వెళ్తామని గడప గడపకు ప్రచారం మొదలు పెట్టారు. ఇక ప్రతిపక్ష నేతలు ఇప్పటి వరకు అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. రాజధాని ఏర్పాటు చేయలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని చెబుతూ పాదయాత్రలు, ర్యాలీలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర బుధవారం నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి యాత్ర ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు అన్నవరం సత్యదేవుడిని దర్శించుకొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారాహి నుంచి తొలి బహిరంగ సభను ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పై ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను కొంతమంది రాజకీయంగా వాడుకుంటున్నారని.. భవిష్యత్ లో ఆయనకు ప్రాణ హాని కూడా ఉందని.. ఆయను చంపించి కొంతమంది సింపతీ ఓట్లు సంపాదించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ది ఆకాంక్షిస్తే.. తమ్ముడూ రండి కలిసి పనిచేద్దాం.. ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ఓటు బ్యాంక్ ఉంది.. ఇక దానికి తోడు జనసేన కు ఉన్న ఒకటీ రెండు శాతం ఓట్లు కలిస్తే మంచి బీసీ నాయకుడిని ఎన్నుకొని ఏపీ ముఖ్యమంత్రిగా నిలబెడదాం.. ఎలాగూ నేను తెలంగాణలో సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.