సాయి ప్రియ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ఓ సంచలనమే సృష్టించింది. పెళ్లిరోజు భర్తతో కలిసి విశాఖ ఆర్కే బీచ్ కు వెళ్లగా అక్కడ గల్లంతైనట్లు అంతా భావించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె కోసం దాదాపు 36 గంటలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 3 కోస్ట్ గార్డ్ షిప్స్, ఒక హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రభుత్వం దాదాపు రూ.కోటి దాకా ఖర్చు చేసింది. తీరా చూస్తే ఆమె ప్రియుడితో కలిసి నెల్లూరులో ప్రత్యక్షమయ్యింది.
తల్లిందండ్రులు చేసిన పెళ్లి ఇష్టంలేక ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఆ తర్వాత ప్రియుడు రవిని పెళ్లాడి తిరిగి విశాఖకు వచ్చింది. ఆమెను మొదట విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన సాయి ప్రియ తనకు చిన్నప్పటి నుంచి రవి అంటేనే ఇష్టమని తేల్చేసింది. కానీ, తల్లిదండ్రులు ఇష్టంలేని పెళ్లి చేశారంది. అందుకే రవితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నానంది. అందరినీ బహిరంగంగా క్షమాపణ కోరింది.
అక్కడితో పోలీసులు యువతి తల్లిందండ్రులు, భర్త శ్రీనివాస్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. అక్కడితో ఈ కేసు క్లోజ్ అయ్యిందనే అంతా భావించారు. అయితే ఇప్పుడు నేవీ రంగంలోకి దిగింది. అంతసేపు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అంతా డ్రామా అని తెలియడంతో నేవీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి ప్రియపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు, జీవీఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
తమ స్వార్థం కోసం ఇంత ప్రజా ధనాన్ని, అధికారుల సమయాన్ని వృథా చేయడం సరైంది కాదంటూ మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఇదిలా ఉండగా సాయి ప్రియ తల్లిదండ్రులు మాత్రం వారిని ఇంటికి రానివ్వమని స్పష్టం చేశారు. తాము ఎవరి దగ్గరికీ వెళ్లమని.. విడిగా ఉంటామంటూ క్లారిటీ ఇచ్చారు. సాయి ప్రియపై నేవీ అధికారులు ఫిర్యాదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.