ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికి.. పోరాటాన్ని విస్తృతం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ శుక్రవారం హిందూపురం లో మౌనదీక్ష సైతం చేపట్టిన విషయం తెలిసిందే. ఇక శనివారం అఖిలపక్ష నేతలతో కలిసి.. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
ఇది చదవండి : ఎమ్మెల్యే vs దొంగ.. దమ్ముంటే రా చూస్కుందాం
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కలెక్టర్కు బాలకృష్ణ వినతిపత్రం
ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని.. అవసరం అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని నందమూరి హీరో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికే.. జిల్లాల వివాదాన్ని తీసుకొచ్చారంటూ విమర్శించారు. ఒక చిన్న మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ మౌన దీక్ష
సత్యసాయి జిల్లాకు తాము వ్యతిరేకం కాదని.. హిందూపురం జిల్లా కేంద్రం చేయాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు మీద ప్రేమతో ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయలేదని.. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయంటూ బాలకృష్ణ పేర్కొన్నారు. సినిమా టికెట్ల వివాదంపై ఇప్పటికే తన అభిప్రాయాన్ని సినీ పెద్దలకు తెలియజేశానని తెలిపారు. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం వివాదం సృష్టిస్తోందంటూ మండిపడ్డారు. హిందూపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి కలసి పని చేస్తామంటూ పేర్కొన్నారు. ఎక్కడ ఉన్నా తన పోరాటాన్ని కొనసాగిస్తానంటూ బాలయ్య స్పష్టంచేశారు.