నెల్లూరు జిల్లాలో సముద్ర తీరానికి అనుమానాస్పదంగా ఉన్న ఓ పడవ కొట్టుకువచ్చింది. అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్ర తీరంలో ఈ అనుమానాస్పద పడవ దర్శనమిచ్చింది. ఇది గమనించిన మత్స్యకారులు దగ్గరకు వెళ్లి పడవను పరిశీలించారు. దాని లోపల బుద్ధుడి విగ్రహం, శివలింగం కనిపించాయి. వీటిని గమనించిన మత్స్యకారులు ఇదేదో స్మగ్లింగ్, దొంగ సరుకు రవాణాకు చెందిన పడవ అని భావించి.. దీని గురించి మెరైన్ పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి.. పడవను పరిశీలించారు. ఇది శ్రీలంకకు చెందినది అని భావిస్తున్నారు. గతంలో కూడా ఇలా అనేక సార్లు జరిగిందని వారు గుర్తు చేసుకున్నారు. పడవను చూడ్డానికి చుట్టుపక్కల జనాలు భారీగా తరలి వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.