ఒక గొప్ప నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా మురళీ మోహన్ కు మంచి పేరు, అభిమానగణం ఉంది. ముఖ్యంగా సొంతూరికి ఆయన చేసే సేవను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మరోసారి ఆయన తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం సొంత ఊరిపై ఆయనుకున్న అభిమానాన్ని, ఆ ఊరితో ఆయకున్న అనుబంధాన్ని తెలిసేలా చేశాయి. ఆయన పుట్టి పెరిగిన ఊరిలో వారి తాతలనాటి ఇంటిని ఆధునికీకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కోట్లు ఖర్చు చేసి రీమోడలింగ్ చేయిస్తున్నారు. దానిని ప్రజా ప్రయోజనం కోసమే ఉపయోగిస్తానంటూ చెబుతున్నారు.
మాజీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ఏలూరు జిల్లా చాటపర్రులోని తాతలనాటి ఇంటిని ఆధునికీకరణ చేయిస్తున్నారు. 98 సంవత్సరాలనాటి ఇల్లు కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. గతంలో ఆ ఇంట్లో ప్రజా వైద్యశాల నిర్వహించేవారు. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ కేంద్రాన్ని మరో చోటుకి మార్చారు. ఇప్పుడు ఈ ఇంటిని దాని రూపు కోల్పోకుండా యథావిథాగా ఉంచుతూనే సిమెంట్ తో రీమోడల్ చేస్తున్నారు. పనులు పూర్తైన తర్వాత ఆ ఇంటిని ఊరి ప్రజల ప్రయోజనం కోసమే వినియోగిస్తామంటూ మురళీ మోహన్ స్పష్టం చేశారు.
“నేను ఈ ఇంట్లోనే పుట్టి పెరిగాను, నా చదువు, నేను హీరోగా మారడం, నా వ్యాపారాలు అన్నీ ఈ ఇంటి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ఇల్లు కట్టి ఇప్పటికి 98 సంవత్సరాలు కావొస్తోంది. అప్పట్లో సిమెంట్ లేదు కాబట్టి 18 అంగుళాల వెడల్పుతో ఇటుకలు, సున్నంతో కట్టారు. భవనం రూపం ఏ మాత్రం మారకుండా మరమ్మత్తులు చేయిస్తున్నాను. జన్మ భూమిని, ఉన్న ఊరిని, కన్న తల్లిని మర్చిపోకండి, మన ఊరిని గుర్తు పెట్టుకోండి, మన గ్రామాన్ని బాగుచేయండని.. చంద్రబాబు గారు ఇచ్చిన పిలుపుని స్ఫూర్తిగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను.”
“పాత గోడలను చెక్కించి సున్నంతో మరమ్మత్తులు చేయిస్తున్నాను. ఈ ఇల్లు ఇంకో 50 ఏళ్లపాటు గ్యారెంటీగా ఉండేలా ఆధునికీకరణ చేయిస్తున్నాను. మా తరం అయిపోయేవరకు అయినా ఉండాలిగా అని బాగుచేయిస్తున్నాం. ఈ పనులు పూర్తైన తర్వాత ఏం చేయాలి అనే విషయంపై.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ విషయంలో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఒక స్పష్టత వచ్చిన తర్వాత వెల్లడిస్తాను. ఏ నిర్ణయం తీసుకున్నా అది ఊరి ప్రజలకు ఉపయోగపడేలాగే ఉంటుంది. ఏదైనా ప్రజా ప్రయోజనం కోసమే ఈ ఇంటిని వినియోగిస్తాం” అంటూ మురళీ మోహన్ వ్యాఖ్యానించారు.