రోజురోజుకు ఆడవారిపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభంశుభం తెలియని పసి పిల్లలపై కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. మానవ రూపంలో ఉన్న ఓ కామపిశాచి ఎలాంటి దారుణానికి పాల్పడ్డాడో తెలుసుకుందాం..
నేటి సమాజంలో విలువలు, వరుసలు లేకుండా పోతున్నాయి. ఏ రోజు ఎటువంటి దారుణమైన వార్తలు వినవలసివస్తుందో అని భయపడాల్సి వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఆడవారిపై అకృత్యాలు ఏదో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. అభంశుభం తెలియని ఓ చిన్నారిపై ఓ కామాంధుడు కన్నేసి తన వాంఛ తీర్చుకున్నాడు. ఓ మానవ మృగం వావి వరుసలు మరిచి సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. వరుసకు చెల్లెలు అయిన పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కలిదిండి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు జిల్లా కలిదిండి మండలం మట్టగుంట గ్రామానికి చెందిన బాలిక.. ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ మండవల్లి స్కూల్లో చదువుతోంది. బాలిక వయసు పదేళ్లు, తను ఐదో తరగతి చదువుతోంది. హాస్టల్కి దగ్గరలో పెద్దమ్మ (తల్లి అక్క) వాళ్ల ఇల్లు ఉంది. అక్కడ పెద్దమ్మతో పాటుగా అబ్రహం (పెద్దమ్మ కొడుకు) కూడా నివాసముంటున్నారు. దీంతో తల్లి అక్క ఇంటికి తరచు తీసుకువస్తుండేది. బాలికకు అన్న వరుస అయిన అబ్రహం(20) బాలికపై కన్నేశాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో బాలికను హాస్టల్ నుంచి తీసుకుని వచ్చేవాడు. ఆ అమ్మాయిపై పలుమార్లు లైంగికదాడి చేశాడు.
అంతేకాక ఈ నెల 16న అబ్రహంకు పరిచయమున్న పఠాన్ ఖాదర్ ఖాన్ అనే 50 ఏళ్ల వ్యక్తితో కలిసి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. శుక్రవారం మరోసారి హాస్టల్ నుంచి అమ్మాయిని తీసుకురావడానికి వెళ్లగా బాలిక ఏడుస్తూ హాస్టల్ వార్డెన్కు జరిగిన విషయం చెప్పింది. వార్డెన్ పేరెంట్స్ను పిలిపించి, జరిగిన విషయం తెలియజేసింది. దీంతో తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అబ్రహం, ఖాదర్ఖాన్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఫోక్సో, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు.
మండపల్లి బాలికల హాస్టల్ సంక్షేమాధికారిణి కె. నాగమణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముదినేపల్లి కళాశాల బాలికల హాస్టల్ వేల్ఫేర్ ఆఫీసర్ కె. అనితకు ఇన్చార్జ్ వార్డెన్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. లైంగిక దాడికి గురైన బాలికను ఏలూరు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జిల్లా ఎస్పీ మేరి ప్రశాంతి బాలికను శనివారం పరామర్శించారు. బాలికకు ధైర్యం చెప్పి తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని.. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.