గుంటూరు నగరంలోని జిన్నా టవర్ పై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం రోజున జిన్నా టవర్ పై జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. ఈ నేపథ్యంలో వివాదానికి పుల్స్టాప్ పెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం తెలివిగా, సమర్థంగా వ్యవహరించింది. తాజాగా జిన్నా టవర్కు జాతీయ జెండాలోని రంగులు వేశారు.
వివరాల్లోకెళితే.. గుంటూరు నగరంలో జిన్నా రాకకు గుర్తుగా జిన్నా టవర్ ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం రాక ముందే మహ్మద్ ఆలీ జిన్నా గుంటూరులో బహిరంగ సభకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి క్షణంలో ఆయన పర్యటన రద్దైంది. ఆయన పర్యటించలేకపోవటంతో ఆయన పేరు మీద టవర్ నిర్మించారు. ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన ఈ టవర్కు పేరు మార్చాలని గత కొంతకాలంగా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి అబ్దుల్ కలాం పేరు పెట్టాలనే వాదనను బీజేపీ నేతలు తెరపైకి తెచ్చారు. అయితే గుంటూరు కార్పోరేషన్ మేయర్, అధికారులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు.ప్రస్తుత వివాదం నేపథ్యంలో కార్పోరేషన్ మేయరై మనోహర్, ఎమ్మెల్యే ముస్తఫా, మరికొంత మంది నేతలు జిన్నా టవర్ కు జాతీయ జెండాలోని రంగులు వేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఈ నెల 3వ తేదిన జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు వేశారు. 3వ తేదిన జాతీయ జెండా ఎగుర వేస్తామని మేయర్ మనోహర్ చెప్పారు.