అప్పు.. ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఇది బాగా సుపరిచితం. తన జీవితంలో కనీసం ఒక్కసారైనా దీనిని పలకరించే ఉంటాడు. ఇంటి నిండా అవసరాలు, అరకొర జీతాలు.. ఒకటో తారీఖు రాగానే వాయిదాల రిమైండర్లు. ఈఎంఐ అమౌంట్ మారడమో.. కట్టే డేట్ మారడమో జరుగుతుంది తప్ప.. ప్రతి సాధారణ వ్యక్తి జీవితం దాదాపు ఇలాగే ఉంటుంది. ఇలాంటి వాళ్ల అవసరాలను అవకాశాలుగా మలుచుకుని ఈ లోన్ యాప్స్.. ఒక చీకటి సామ్రాజ్యంలా ఎదిగాయి.
ఇప్పుడు వీళ్ల ఆగడాలు ఎంతలా పేట్రేగిపోతున్నాయంటే.. అందులో లోన్ తీసుకున్న వ్యక్తికి పరువనేది లేకుండా చేస్తున్నారు. లోన్ ఇచ్చే సమయంలో మీరు ఇచ్చిన వివరాలను బంధుమిత్రులకు పంపుతూ నానా యాగి చేస్తున్నారు. అంతేకాకుండా మీరు ఎవరినైతే షూరిటీగా పెడతారో వారికి కూడా వేధింపులు తప్పడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వీరి వేధింపులతో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, కార్మికులు, యువకులు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. లక్షల్లో ఈ లోన్ యాప్స్ బాధితులు ఉన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు రోజురోజుకీ రెచ్చిపోతున్న వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఎంత కట్టినా ఇంకా కట్టాలంటూ పీక్కుతింటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా నువ్వు బతికున్నావ్గా కట్టు అంటూ ఇంట్లో వారిని సైతం వదలడం లేదు. మహిళలు, యువతులకు కుడా ఫోన్లు చేస్తూ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. గడువు ఒక్కరోజు దాటినా మెసేజ్లు, ఫోన్లతో నరకం చూపిస్తున్నారు.
ఇన్నాళ్లు వీరి ఆగడాలకు చరమగీతం పాడే అవకాశం ఉందని భావించిన ఎందరికో తాజాగా జరిగిన ఘటనతో ఆశలు నీరు కారిపోయాయి. వీరి ఆగడాలు ఎంతలా మితిమీరిపోయాయంటే.. ఒక మంత్రికి, ఎమ్మెల్యేకి సైతం ఫోన్ చేసి డబ్బు కట్టాలంటూ బెదిరించే స్థాయికి వెళ్లిపోయారు. నేను ఎమ్మెల్యేని అని చెబుతున్నా ముందు తీసుకున్న సొమ్ము తిరిగి కట్టూ అంటూ ధమ్కీ ఇస్తున్నారు.
ఏపీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ కు లోన్ యాప్ రికవరీ ఏజెంట్ని అంటూ ఫోన్ వచ్చింది. మీరు తన బావ అంటూ అశోక్ అనే వ్యక్తి మీ నంబరు ఇచ్చారని ఫోన్ చేశారు. ఆయన రూ.8 లక్షలు అప్పు తీసుకున్నాడు. అడిగితే మీరు కడతారని చెప్పాడు.. ఎప్పుడు కడతారంటూ గద్దించారు. నేను ఎమ్మెల్యేని అని చెబుతున్నా తీసుకున్న డబ్బులు కట్టండి సార్ అంటూ గట్టిగానే హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అలాగే ఏపీ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ కి కూడా ఈ రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్ వచ్చింది. మీకు తెలిసిన వ్యక్తి లోన్ చెల్లించలేదని.. రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పపడ్డారు. తీసుకున్న డబ్బు వెంటనే కట్టకపోతే మీ పరువు తీస్తామని మంత్రికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో మంత్రి కాకాని పీఏ శంకర్ కృష్ణపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన కృష్ణపట్నం పోలీసులు రికవరీ ఏజెంట్లతో పాటు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధిని అరెస్ట్ చేశారు.
ఇప్పుడు ఈ చర్యతో మంత్రులు, ఎమ్మెల్యేలకే వీళ్లు వార్నింగ్లు ఇస్తుంటే.. సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వ్యవస్థలోని లూప్ హోల్స్ ని అడ్డుగా పెట్టుకుని ఇలా వేధింపులకు పాల్పడుతున్న లోన్ యాప్స్ నిర్వాహకులు, రికవరీ ఏజెంట్లను ఎవరు కట్టడి చేస్తారంటూ వాపోతున్నారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ఇంకా ఎంత మంది అమాయకుల జీవితాలు ఆగమవుతాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయో అంటూ బెంబేలెత్తిపోతున్నారు. అలాంటి యాప్స్ లో లోన్ తీసుకోకుండా ఉండచ్చు కదా అంటూ కామెంట్ చేసే వాళ్లు కూడా ఉన్నారు. అప్పటి వారి పరిస్థితులకు లొంగిపోయి రుణం తీసుకుని తర్వాత వీళ్ల వేధింపులతో బలి పశువులుగా మారుతున్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రమో, ప్రాంతంలోనో జరుగుతున్నది కాదు. యావత్ దేశంలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ లోన్ యాప్స్ ఆగడాలను అరికట్టేదేలా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.