సాధారణంగా సముద్ర జీవుల దాడిలో మనుషులు మృతి చెందడం వంటి సంఘటనలు ఎక్కువగా విదేశాల్లో చోటు చేసుకోవడం గమనిస్తాం. అలాంటి వాటి గురించి తెలిసినప్పుడు వింతగా, భయంగా అనిపిస్తుంది. అదే కోవకు చెందిన సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఓ రాకాసి చేప దాడిలో మత్స్యకారుడు మృతి చెందాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. ఈ సంఘటన వాస్తవం. ఆ వివరాలు.. విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం శివారు జాలారీపేట గ్రామానికి చెందిన నొల్లి జోగన్న (45).. కంబాల చినదేముడు, కంబాల కొర్లయ్య, కంబాల మహేష్, ఓలిశెట్టి అప్పలరాజు, ఓలిశెట్టి ముత్తురాజుతో కలిసి ఆదివారం రాత్రి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు.
ఉదయం తెల్లవారుజామున తీరానికి చేరే క్రమంలో జోగన్న చేపలకు గేలం వేశాడు. పడవ పై నుంచి వలను పైకి లాగుతుంటే.. బరువుగా ఉండటంతో దానిని పైకి లాగేకపోయారు. దీంతో వల చిక్కుకుందేమోనని చూసేందుకు జోగన్న పడవ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో చేప బలంగా దాడి చేసింది. దాంతో జోగన్న అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో జరగడం వల్ల గాయపడిన జోగన్నకు సకాలంలో వైద్య సేవలు అందించడం సాధ్యపడలేదని, తీరానికి చేరడానికి తమకు 8 గంటల సమయం పట్టిందని తోటి మిత్రులు వాపోయారు.జోగన్నపై కొమ్ముకోనాం చేప దాడి చేసిందని తోటి మత్స్యకారులు చెప్పినట్లు పరవాడ సీఐ ఈశ్వరరావు తెలిపారు. పదునైనా కత్తిలాంటి కొమ్మును కలిగి ఉండే కొమ్ముకోనాం చేపలకు సాధారణంగా దాడి చేసే గుణముంటుందని వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడు గంగన్న తెలిపారు. “ఈ కొమ్ముకోనాం వలకు దొరకడం కష్టమే. అంత సులభంగా దొరకవు. దొరికినా కొన్నిసార్లు వలను చీల్చుకొని తప్పించుకుంటాయి. ఇవి బరువు ఎక్కువగా ఉండటంతో వలను పైకి లాగలేకపోయాం. అయితే అందరం బలంగా వలను పైకి లాగే సమయంలో జోగన్న కిందకు దిగేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే కోనాం చేప జోగన్నను గట్టిగా కొట్టింది. దాంతో జోగన్న అక్కడే సముద్రంలో పడిపోయాడు. ఛాతీపై బలంగా గాయమైంది” అని గంగన్న చెప్పారు.
డిమాండ్తో పాటు ప్రమాదమూ ఎక్కువేఇవి ఒక్కొక్కటి 20 నుంచి 250 కేజీల వరకు కూడా ఉంటాయి. పైగా ఇవి ఒక్కొక్కటిగా కాకుండా గ్రూపులుగా తిరుగుతుండటంతో ఒకేసారి పెద్ద మొత్తంలో వలకు చిక్కుతాయి. అయితే అపాయం అని తలచినప్పుడు కొమ్ముతో తోటి చేపలపైనా, మనుషులపైనా కూడా ఇది దాడి చేస్తుంది.
సాధారణంగా టూనా చేపకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అంతే డిమాండ్ ఉన్న చేప కొమ్ముకోనాం. ఇది ఎక్స్పోర్టు కూడా ఎక్కువగా అవుతుంది. పెద్ద మొత్తంలో ఈ చేప చిక్కితే మత్స్యకారులు ఎక్స్పోర్టు చేసే వారికి వీటిని అమ్మేస్తారు. వల నుంచి బయటకు తీయకుండానే దీనిని సైజు ప్రకారం అంచనా వేసి దీనిని కొనేస్తారు. అంత డిమాండ్ ఉంటుంది.‘‘దీనికి వంజరం అని కూడా మరో పేరు ఉంది. తీరం నుంచి సుమారు ఆరేడు నాటికన్ మైళ్లు దాటిన తర్వాత నుంచి ఈ కొమ్ముకోనాం చేప లభిస్తుంది. ఈ చేపకు డిమాండ్ ఎంత ఉందో ఈ చేపతో ప్రమాదం అంతే ఉంది’’ అని ఏయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత తెలిపారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.