దేశంలోని అందరు ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆస్తులు, క్రిమినల్ కేసులు, గన్ లైసెన్సులు, వ్యక్తిగత వాహనాలు, స్థిరాస్తులు ఇలా మొత్తం 7 అంశాలతో ఒక నివేదిక విడుదలైంది. ప్రముఖ ఆంగ్ల వెబ్ సైట్ ది ప్రింట్ ఈ నివేదికను సిద్ధం చేసింది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ వివరాలు అన్నీ ముఖ్యమంత్రులు సమర్పించే అఫిడవిట్ల ఆధారంగా తయారు చేసినట్లు తెలిపారు. ది ప్రిట్ పత్రిక నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారు. అలాగే అత్యంత పేద సీఎంగా మమతా బెనర్జీ నిలిచారు. ఆ నివేదిక పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
దేశంలోనే అత్యంత ధనిక సీఎం జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టాప్ ప్లేస్ లో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.370 కోట్లుగా వెల్లడించారు. వారసత్వంగా వచ్చిన ఆస్తులు కానివ్వండి, వ్యాపారవేత్తగా ఆయన సంపాదించిన ఆస్తులు అన్నీ కలిపి ఇంత మొత్తంగా తెలిపారు. స్థిరాస్తుల జాబితాలోనూ సీఎం జగన్ మొదటి వరసలో ఉన్నారు. సీఎం జగన్ తర్వాత రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.132 కోట్లుగా వెల్లడించారు. ఇంక అత్యంత పేద ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ నిలిచారు. ఆవిడ ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలుగా చూపించారు.
ఆస్తుల జాబితాలో చివరి నుంచి రెండో స్థానంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్(రూ.56 లక్షలు), తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్(రూ.72 లక్షలు), అస్సాం సీఎం హిమాంత బిస్వ శర్మ(రూ.1.04 కోట్లు) ఉన్నారు. ఇంక క్రిమినల్ కేసుల జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో నిలిచారు. కేసీఆర్ పైనే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నట్లు ది ప్రింట్ వెల్లడించింది. ఆయన తర్వాతి స్థానంలో 47 కేసులతో తమిళనాడు సీఎం స్టాలిన్ నిలిచారు. సీఎం జగన్ పై కూడా కేసులు ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై 38 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. బీజేపీకి చెందిన 10 మంది ముఖ్యమంత్రులు క్లీన్ చిట్ లో ఉన్నారని.. మమతా బెనర్జీ, అశోక్ గెహ్లోత్, సంగ్మా, రియో, నవీన్ పట్నాయక్, రంగస్వామిలపై అసలు ఎలాంటి నేరారోపణలు లేవని నివేదికలో ది ప్రింట్ వెల్లడించింది.
ముఖ్యమంత్రుల్లో పెళ్లికాని వారు ఎవరూ అనే విషయాన్ని కూడా వెల్లడించారు. అందరు ముఖ్యమంత్రులు ఐదుగురు అవివాహితులు ఉన్నట్లు తెలిపారు. వారు.. మమతా బెనర్జీ, యోగి ఆధిత్యనాథ్, మనోహర్ లాల్ ఖట్టర్, రంగస్వామి, నవీన్ పట్నాయక్ పెళ్లిచేసుకోలేదు. అలాగే సిక్కిం ముఖ్యమంత్రి తమాంగ్ కు ముగ్గురు భార్యలు ఉన్నారు. వారు ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే. వ్యక్తిగత వాహనాల విషయంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ 7 వాహనాలతో తొలిస్థానంలో ఉన్నారు. సీఎం జగన్ కు 4 వాహనాలు ఉండగా.. వాటిలో 3 స్కార్పియోలు, ఒకటి బీఎండబ్ల్యూ. 8 మంది ముఖ్యమంత్రులకు అసలు వ్యక్తిగత వాహనాలు కూడా లేవని చెప్పారు. వారిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు.
Andhra CM @ysjagan is the richest CM in India as per @ThePrintIndia article👇🏼 pic.twitter.com/EKMphaERaW
— Telangana (@TelanganaRT) December 28, 2022