YSRCP MLC: ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం వెలుగు చూసిన ఘటన కాకినాడలో కలకల రేపింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్బాబు కారులో ఆయన డ్రైవర్ సుబ్రమణ్యం మృతదేహం వెలుగు చూసింది. సుబ్రమణ్యం గత ఐదేళ్లుగా అనంత ఉదయ్ బాబు దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నిన్న ఉదయం ఎమ్మెల్సీతో కలిసి కారులో బయటకు వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో సుబ్రమణ్యం యాక్సిడెంట్కు గురయ్యాడంటూ అతడి సోదరుడికి ఉదయ్బాబు సమాచారం ఇచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున తన కారులోనే సుబ్రమణ్యం మృతదేహాన్ని కాకినాడకు తీసుకువచ్చి, అతడి తల్లిదండ్రులకు అప్పగించాడు.
శవాన్ని బయటకు తీయాలంటూ ఉదయ్ బాబు తమపై ఆగ్రహం వ్యక్తం చేశాడని, ఏమైందని అడగ్గా సమాధానం చెప్పకుండా వేరే కారులో అక్కడినుంచి వెళ్లిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడి మరణం యాక్సిడెంట్ ద్వారా జరిగినట్లు అనిపించటం లేదన్నారు. సుబ్రమణ్యం, ఉదయ్ బాబుకు 20 వేలు ఇవ్వాలని, డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉదయ్ బాబు హెచ్చరించారని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న మృతదేహాన్ని తరలించటానికి ప్రయత్నించారు. అయితే, మృతదేహాన్ని కారులోంచి తీయటానికి సుబ్రమణ్యం బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఇప్పటికీ మృతదేహం కారులోనే ఉండిపోయింది.
కారులో శవంపై ఎమ్మెల్సీ క్లారిటీ..
కారులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవం లభ్యమైన ఘటనపై ఎమ్మెల్సీ అనంత ఉదయ్బాబు క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ…‘‘ సుబ్రహ్మణ్యం నా దగ్గర ఐదేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రెండు నెలల నుంచి సరిగా పనిలోకి రావడం లేదు. మద్యం అలవాటు ఉండటంతో ద్విచక్రవాహనంపై అనేకసార్లు ప్రమాదానికి గురయ్యాడు. గత రాత్రి కూడా సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్కు గురైనట్టు తెలియడంతో అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చా. చికిత్స కోసం కాకినాడ అమృత ఆసుపత్రికి తీసుకెళ్లాం. అతని తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి వచ్చాం. సుబ్రమణ్యం మృతి చెందడంతో మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకువెళతామని చెప్పడంతో కారులో అపార్ట్మెంట్ వద్దకు తీసుకెళ్లాం’’ అని అన్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : IPL: IPL మ్యాచ్ చూస్తుండగా దంపతులపై దారుణం..