అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఒక వృద్దుడికి ఆపరేషన్ జరుగుతుండగా గుండె ఆగిపోయింది. అయితే వైద్యులు అద్భుతం చేసి ఆ వృద్ధుడిని కాపాడారు. వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఆగిపోయిన గుండెను చేతితో కదిలించి మరీ తిరిగి కొట్టుకునేలా చేశారు.
ప్రకాశం జిల్లా నందనవనం గ్రామానికి చెందిన విట్టా వెంకటేశ్వర్లు (70) లక్షల్లో ఒకరికి మాత్రమే సంభవించే అరుదైన డయాఫ్రాగ్మెటిక్ హెర్నియా వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో పాటు నెల రోజులుగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు వృద్దుడ్ని జనవరి 17న గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్చారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధుడికి అత్యవసర సేవల విభాగంలో పరీక్షలు నిర్వహించారు. గ్యాస్ట్రిక్ అవుట్ లెట్ అబ్ స్ట్రక్షన్ పరీక్ష చేయగా.. కడుపులో క్యాన్సర్ వల్ల ఆహారం పొట్టలోకి వెళ్లడం లేదని నిర్ధారించి వృద్ధుడిని జనరల్ సర్జరీ వార్డులో అడ్మిట్ చేసుకున్నారు వైద్యులు.
వృద్ధుడికి సీటీ స్కానింగ్, బేరియం ఎక్స్ రే, గ్యాస్ట్రో స్కోప్, ఎండోస్కోపీ స్కానింగులు చేసి గుండె బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు డయాఫ్రాగ్మెటిక్ హెర్నియా వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా వైద్యులు గుర్తించారు. గుండె, ఊపిరితిత్తులు, కడుపుకి మధ్య ఉండే డయాఫ్రమ్ కి రంధ్రం పడి.. అందులో నుంచి కడుపు, పెద్ద పేగు సగభాగం గుండెకు, ఊపిరితిత్తులకు అతుక్కున్నట్లు నిర్ధారించుకున్నారు. మామూలుగా పుట్టుకతో డయాఫ్రమ్ కి రంధ్రాలు ఏర్పడి.. వయసు పెరిగే కొద్దీ పూడుకుపోతాయని.. కానీ వెంకటేశ్వర్లు విషయంలో రంధ్రం పూడుకుపోకుండా పేగులు, కడుపు, గుండె, ఊపిరితిత్తుల మధ్యకు వెళ్లిపోయిందని కిరణ్ కుమార్ చెప్పారు.
అయితే గుండె, ఊపిరితిత్తుల మధ్య అతుక్కుని ఉన్న పేగులను, కడుపును కిందకు తీసేందుకు ఫిబ్రవరి 2న ఆపరేషన్ ప్రారంభించామని. అయితే ఆపరేషన్ చేస్తున్న సమయంలో అతని గుండె ఆగిపోయిందని అన్నారు. ఆ సమయంలో వృద్ధుడి ఛాతిపై సీపీఆర్ చేస్తామని, ఆపరేషన్ ఆపాలని మత్తు వైద్యులు సూచించారు. వెంటనే తాను కడుపులో డయాఫ్రమ్ కి ఉన్న రంధ్రం ద్వారా చేతిని గుండె పైకి తీసుకెళ్లి.. ఆగిపోయిన గుండెను చేతితో నొక్కి కార్డియాక్ మసాజ్ చేయడంతో కొన్ని క్షణాల్లోనే ఆగిన గుండె కొట్టుకోవడం ప్రారంభించిందని డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. 3 గంటల సేపు ఆపరేషన్ చేసి.. ఛాతి, గుండెలోకి వెళ్లిన కడుపును, పెద్ద పేగును కిందకు లాగి మళ్ళీ మళ్ళీ సమస్య రాకుండా ప్రొలేన్ మెష్ అమర్చడం ద్వారా డయాఫ్రమ్ ను పూర్తిగా మూసివేశామని తెలిపారు.
రోగిని 2 రోజుల పాటు ఐసీయూలో ఉంచి గుండె, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు బాగున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వెంటిలేటర్ తొలగించి సాధారణ వార్డుకి తరలించామని డాక్టర్ వెల్లడించారు. వృద్ధుడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. మరి ఆపరేషన్ జరుగుతుండగా ఆగిపోయిన గుండెను.. కడుపులో చేయి పెట్టి మరీ కార్డియాక్ మసాజ్ చేసి బతికించిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు కిరణ్ కుమార్, అలానే ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్ చేయాల్సిందే.