ఏపీ రాజధాని అంశం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. విపక్షాలు అమరావతే ఏకైక రాజధానిగా ఉంచాలని పట్టుబడుతుండగా.. వైసీపీ నేతలు మాత్రం మూడు రాజధానులు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆ వివరాలు..
ఏపీ రాజధానుల వ్యవహారం గురించి తీవ్రమైన చర్చ జరుగుతూనే ఉంది. విపక్షాలు అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం.. మూడు రాజధానులు అంటూ చెబుతూ వస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. ఓవైపు అధికార పార్టీ నేతలు.. మూడు రాజధానులు అంటూ ప్రచారం చేస్తుండగా.. ఆ పార్టీ కీలక నేత, ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. బుగ్గన వ్యాఖ్యలు చూస్తే.. మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రానికి విశాఖపట్నం ఒకటే రాజధాని అంటూ బుగ్గన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వివరాలు..
విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు కోసం బెంగళూరులో మంగళవారం (ఫిబ్రవరి 14) ఓ కార్యక్రమం నిర్వహించారు. దీనికి హాజరైన బుగ్గన ఈ సందర్భంగా ఏపీకి విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని స్పష్టం చేశారు. మూడు రాజధానుల అంశం కమ్యూనికేషన్ గ్యాప్ అని బుగ్గన తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. అలానే కర్ణాటకలో మాదిరిగానే ఏపీలో కూడా ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలను గుంటూరులో నిర్వహిస్తామని తెలిపారు. పారిశ్రామిక వృద్ధి ప్రాంతాలుగా తిరుపతి, విజయవాడలను ఎందుకు ఎంచుకోలేదన్న పారిశ్రామికవేత్తల ప్రశ్నకు సమాధానం చెబుతూ.. బుగ్గన రాజధాని అంశంపై మాట్లాడారు. విశాఖ ఒక్కటే రాజధాని అంటూ బుగ్గన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.
బుగ్గన పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర పాలన అంతా విశాఖపట్నం నుంచే నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖను ఎంచుకోడానికి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలే ప్రధాన కారణం. భవిష్యత్తులో విశాఖ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే ఐటీ ఆధారిత పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని ప్రభుత్వం అనుకుంటోంది. అక్కడ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఇప్పటికే విశాఖలో ఐటీ పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.
‘‘అలానే హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ని కర్నూల్లో ఏర్పాటు చేస్తాం. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేం కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం’’ అని చెప్పుకొచ్చారు. మరి బుగ్గన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. విశాఖపట్నం ఒక్కటే ఏపీ రాజధాని అన్న బుగ్గన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.