తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్ లో ఉండగానే ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా తన సత్తా చాటారు చిరంజీవి.
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్గా ప్రేక్షకుల మనసు దోచిన చిరంజీవి.. 26 ఆగష్టు, 2008 ప్రజా రాజ్యం అనే ప్రాంతీయ పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి తిరుపతి నుంచి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అనంతరం చిరంజీవి, ఆగష్టు 2011 లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేంద్రమంత్రిగా వ్యవహరించారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు..అయినప్పటికీ ఆయన పేరు ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన రాజకీయాల కన్నా సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవిపై నమోదు అయిన కేసు ఏపీ హైకోర్టు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల వరకు రాజకీయాల్లో ఎంతో యాక్టీవ్ గా ఉన్నారు. ఆ సమయంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. నిర్ణీత సమయంలో మీటింగ్ పూర్తి చేయకపోవడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని.. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని 2014 లో గుంటూరు పోలీసులు చిరంజీవిపై కేసు నమోదు చేశారు. తనపై నమోదు అయిన కేసు కొట్టివేయాలంటూ మెగాస్టార్ చిరంజీవి ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. కాగా, ప్రాసిక్యూషన్ దీన్ని హైకోర్టులో నిరూపించలేకపోవడంతో చిరంజీవిపై నమోదు అయిన కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. వివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నం. 150’ తో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బోలా శంకర్ మూవీలో నటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ హైకోర్టు కేసు కొట్టేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో పెద్ద ఊరట లభించిందనే చెప్పొచ్చు. అయితే మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి వస్తారా..? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తారు? అన్న విషయం మాత్రం ఇప్పటికీ వరకు క్లారిటీ లేదు.