సంక్రాంతి సీజన్ ప్రైవేటు ట్రావెల్స్ ఆపరేటర్స్ కన్నా కూడా ఆర్టీసీనే ఎక్కువ క్యాష్ చేసుకుంది అనడంలో సందేహం లేదు. అటు తెలంగాణ ఆర్టీసీ, ఇటు APSRTC ఇద్దరూ సంక్రాంతిని సొమ్ము చేసుకున్నారు. తాజాగా ప్రయాణికులకు APSRTC మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. విజయవాడ- బెంగళూరు మధ్య ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది. వెన్నెల స్లీపర్, అమరావతి ఏసీ బస్సుల టికెట్లపై 20 శాతం రాయితీ ప్రకటించింది. ఈ బస్సులు వయా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి మీదుగా వెళ్తాయి కాబట్టి.. ఆ రూట్లలో ఎక్కే వారికి కూడా ఈ రాయితీని వర్తింపజేస్తోంది.
కాకపోతే ఇందులో ఒక షరతు విధించింది. శుక్రవారం బెంగళూరు నుంచి వచ్చే సర్వీసులో, ఆదివారం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే సర్వీసులో మాత్రం ఈ రాయితీ వర్తించదు. మిగిలిన అన్ని రోజులు ప్రయాణికులు ఈ రాయితీని పొందవచ్చు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వెన్నెల స్లీపర్ సర్వీసు టికెట్ ధర సాధారణంగా రూ.1,830 కాగా 20 శాతం రాయితీ పోను రూ.1,490గా నిర్ణయించారు. విజయవాడ నుంచి వెళ్లే అమరావతి ఏసీ బస్సు టికెట్ ధర రూ.1,710 కాగా రూ.1,365గా నిర్ణయించారు. బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వెన్నెల, అమరావతి సర్వీస్సుల్లోను ఇవే రేట్లను అమలు చేయనున్నారు. ప్రయాణికులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలంటూ ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. APSRTC తీసుకొస్తున్న ఈ సరికొత్త రాయితీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.