ఏపీలో పీఆర్సీ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. దీంతో పాటు ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
అయితే పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు.. సమ్మె బాట పట్టనున్నట్లు తెలిపారు. పీఆర్సీ జీవోలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయవాడలో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు.
భగ్గుమన్న ఉద్యోగులు
ఇవాళ సమావేశమైన ఏపీ కేబినెట్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న పీఆర్సీ జీవోలకు ఆమోదముద్ర వేస్తూ తీసుకున్న నిర్ణయంపై భగ్గుమన్నారు. విజయవాడలోని ఏపీఎన్జీవో భవన్ లో సమావేశమైన ఉద్యోగులు.. ఈ జీవోలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన నిర్ణయం తెలియగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ తదుపరి కార్యాచరణను ఖరారు చేశారు. ఇందులో నాలుగు ఉద్యోగసంఘాల జేఏసీలు ఏకమై పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి పోరు కొనసాగించాలని నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ రిస్క్ చేస్తున్నారా?
ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి
ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకంగా పీఆర్సీ జీవోల్ని విడుదల చేయడంతో పాటు వాటిని కేబినెట్ లో ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగసంఘాలు.. దీనికి నిరసనగా వచ్చే నెల నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం సీఎస్ సమీర్ శర్మను కలిసి సమ్మె నోటీసు అందజేయాలని నాలుగు ఉద్యోగ సంఘాల జేఏసీలతో కూడిన పీఆర్సీ సాధన సమితి నిర్ణయించింది. అనంతరం జనవరి 23న జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించబోతున్నారు.
అలాగే ఈ నెల 25న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు ధర్నాలు చేపట్టనున్నారు. అనంతరం 26న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాల సమర్పించాలని నిర్ణయించారు. ఈ నెల 27 నుంచి 30 వరకూ జిల్లాల్లో నిరాహారదీక్షలు చేపట్టాలని ఉద్యోగసంఘాలు నిర్ణయించాయి. ఫిబ్రవరి 3న రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులతో ఛలో విజయవాడ చేపట్టనున్నారు. అలాగే ఫిబ్రవరి 5 నుంచి ప్రభుత్వానికి సహాయనిరాకరణ చేయాలని నిర్ణయించారు. అంతిమంగా ఫిబ్రవరి 7 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఏపీ పీఆర్సీ వల్ల ఉద్యోగులకి లాభమా? నష్టమా?