బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 5.1గా నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం 12.35 గంటలకు భూమి కంపించింది. భూకంప ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో పలుచోట్ల స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి 260 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు 296 కి.మీ దూరంలో ఆగ్నేయంగా, చెన్నైకి 320 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
భూకంపం ప్రభావంతో తమిళనాడులోనూ ప్రకంపనలు సంభవించాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని తీరాల్లో సముద్ర గర్భంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు. సునామీ వస్తుందని వాట్సప్ ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన సూచించారు.