ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఎండలు దంచికొడుతున్నాయి.. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అంతలోనే వాతావరణం చల్లబడి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి.
సాధారణంగా ఎండాకాలంలో ఎండలు దంచికొడుతుంటాయి.. వేసవి తాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. వాతావరణం కాస్త చల్లబడితే బాగుంటుంది బాబోయ్ అనుకుంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలంలో రోజు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు కాలు బయటపెట్టాలంటేనే జంకుతున్నారు. ఎండ తీవ్రతకు ఉక్కిరబిక్కిరి అవుతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతల తాకిడికి ప్రజలు అనారోగ్యం పాలైనారు. ఈ సమయంలో ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్లో ఇటీవల భిన్న వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి రాయలసీమ , కోస్తా జిల్లాలోకి చల్లని గాలులు వీస్తున్న కారణంగా మూడురోజులపాటు వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతిలో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షంతోపాటు ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రహదారులపై చెట్లు కూలడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
ఉపరితల ఆవర్తనం ఉత్తర దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం వెళుతోంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. అక్కడక్కడ ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.