కరోనా విపత్కర పరిస్థితిల్లో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో కష్టం. మనసుని కలిచి వేచే విషాద సంఘటనలు దేశం అంతా జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ ఇందుకు వేదిక అయ్యింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా సరైన సమయానికి అందక 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చెన్నై నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్స్ 5 నిముషాలు ఆలస్యంగా రావడంతోనే ఈ దారుణం జరిగిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు కొనసాగుతోన్నాయి. దీనితో.., ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది. తాజాగా ఈ ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియచేశారు. అలాగే.., చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. ఇక రుయా ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని.. మన ప్రమేయం లేని అంశాలకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. తమిళనాడు నుంచి సరైన సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోవడం వల్లే 11 మంది చనిపోయారన్నారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఇకపై ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగకుండాప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులను నియమించింది. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే ఆక్సిజన్ ఈ ముగ్గురు అధికారుల పర్యవేక్షణలో సరఫరా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే.., ప్రభుత్వం చెప్తున్నట్టు ఆక్సిజన్ సరఫరాకి అంతరాయం కలిగింది 5 నిముషాలు మాత్రమే కాదని.., 30 నిమిషాల వరకు ఆక్సిజన్ అందలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వెంటిలేటర్ పై ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న వారికీ… ఊపిరి అందించేందుకు బాధిత బంధువులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కన్నీరు పెట్టేలా చేశాయి.