అంబులెన్స్ డ్రైవర్లు కీలక సమయాల్లో చాకచక్యంగా, సాహసాలు ప్రదర్శించి పేషెంట్ ల ప్రాణాలను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఇదే విధంగా ఓ అంబులెన్స్ డ్రైవర్ అసాధారణ పరిస్థితుల్లో పేషెంట్ ను ఆసుపత్రికి తరలించాడు.
ప్రమాదం ఏదైనా సమాచారం అందిన వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి అంబులెన్స్ లు. 24 గంటలు అందుబాటులో ఉంటూ అనారోగ్యంతో బాధపడుతున్న పేషంట్ లను, ప్రమాదాలకు గురైన క్షతగాత్రలను సకాలంలో ఆసుపత్రులకు తరలించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు అంబులెన్స్ డ్రైవర్స్. బాధ్యాతాయుతంగా వ్యవహరించి ధైర్య సాహసాలను ప్రదర్శించి ఎంతో మంది ప్రాణాలను రక్షిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. ఇదే రీతిలో ఓ జిల్లాలో అంబులెన్స్ డ్రైవర్ చూపిన సాహసం, సమయస్ఫూర్తి ఓ రోగి ప్రాణాలను కాపాడింది. భారీ వర్షాలు, వరదల్లో ఆ డ్రైవర్ చూపిన తెగువకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో కొలగంటి బాబురావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. కాగా ఉన్నట్టుండి బాబురావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ డ్రైవర్ కార్తిక్ లింగాల రోగి వద్దకు చేరుకుని 108 వాహనంలో పెనుగంచిప్రోలు మీదుగా జగ్గయ్యపేటకు తరలిస్తున్నారు. అయితే రాష్ట్రంలో దంచికొడుతున్న వానలతో పెనుగంచిప్రోలు బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు బ్రిడ్జిపై నుంచి రాకపోకల్ని నిలిపివేశారు.
కాగా అంబులెన్స్ జగ్గయ్యపేటకు వెళ్లే క్రమంలో పెనుగంచిప్రోలు బ్రిడ్జి వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. వరదలో బ్రిడ్జి దాటడం ప్రమాదం అని వేరే మార్గంలో వెళ్లాలని సూచించారు. కానీ రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అంబులెన్స్ డ్రైవర్ సాహసం చేశాడు. వరద నీటిలో బ్రిడ్జిపై నుంచి ప్రాణాలకు తెగించి బ్రిడ్జి దాటించాడు. ఆ తర్వాత జగ్గయ్యపేటలోని ఓ ఆసుపత్రికి రోగిని తరలించారు. సకాలంలో పేషంట్ ను హాస్పిటల్ కు చేర్చడంతో ప్రమాదం తప్పింది. దీంతో అంబులెన్స్ డ్రైవర్ చేసిన సాహసానికి సర్వత్ర ప్రశంసలు కురిపిస్తున్నారు.