దేశవ్యాప్తంగా బస్సుల తర్వాత ప్రధాన రవాణా మార్గం ఆటోలు. సిటీల మొదలు పల్లెటూర్ల వరకు ఇవే మొదటి ఆప్షన్ గా ఉన్నాయి. ఈ ఆటోలపై ఆధారపడి లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. చాలా మంది ఎంతో జాగ్రత్తగా ప్రయాణికులను ఎక్కించుకోవడం, వారి గమ్యస్థానాలకు చేర్చడం చేస్తుంటారు. అయితే కొద్ది మంది మాత్రం ఆటోవాలా ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారు. కొందరితో కుమ్మకై ప్రయాణికులను దోచుకుంటున్నారు. అలాంటి ఘటనలు చాలానే వెలుగు చూస్తున్నా.. పాపం ఇంకా మోసపోతున్నారు. అలాంటి మోసాలు ఎలా జరుగుతాయో ఓ సందర్భం ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాం.
అది శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం సవరడ్డపనసకు చెందిన అమ్ములమ్మ అనే వృద్ధురాలికి కిరాణా దుకాణం ఉంది. కొట్టుకు కావాల్సిన సామాన్ల కోసం చెల్లవానిపేట వెళ్లింది. అక్కడ సరుకులు తీసుకుని రోడ్డు మీదకు రాగానే ఓ ఆటో వచ్చి ఆగింది. అమ్మా ఆటో కావాలా అని అడగ్గానే.. ఆ కావాలి అంటూ ఆటో ఎక్కింది. ఆమె తర్వాత మరో ఇద్దరు మహిళలు కూడా ఆటో ఎక్కారు. తర్వాత అమ్ములమ్మను మాటల్లో పెట్టారు. ఆమె మెడలో ఉన్న పుస్తెల తాడు లాగాలని ప్రయత్నించారు.
మెడలోంచి తీయడానికి వీలు కాకపోవడంతో కత్తిరించాలని అనుకున్నారు. ఆమెను ఇంటి వద్ద దిగబెడతామంటూ మాయ మాటలు చెప్పి ఇరుకైన, గుంటలు ఉండే సందులోకి తీసుకెళ్లారు. ఆ కుదులు, గుంటల దారిలో ఆమెకు తెలియకుండానే మెడలోని పుస్తెలతాడును కత్తిరించారు. తర్వాత వాళ్లు మరో డ్రామా మొదలు పెట్టారు. తమవారికి ప్రమాదం జరిగిందిని చెప్పి హడావుడిగా ఊరి బయటకు ఆటో తీసుకెళ్లి అమ్ములమ్మను దింపేశారు. సామాన్లు తీసుకుని ఆమె నడక ప్రారంభించింది.
తర్వాత చీరలోంచి పూసలు కింద పడ్డాయి. మెడ చూసుకోగా మంగళసూత్రం లేదు. ఇంకేముంది.. పుస్తెలతాడు కత్తిరించేశారని గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆటోలో ప్రయాణించిన వాళ్లే ఆమె మంగళసూత్రం కాజేశారని అనుమానం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ వంటి నగరాల్లోకూడా ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. తోటి ప్రయాణికుల ముసుగులో సెల్ ఫోన్స్ కాజేయడం పెరిగిపోయింది. అందుకే పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.