కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ‘ఐపీఎల్ 2021’ సీజన్ ఎంతో పకడ్బంధీగా నిర్వహిస్తున్నారు. దాదాపు ఆఖరి అంఖానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు అయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి బీసీసీఐ ఒక ప్రయోగం చేసింది. మరి అది బెడిసి కొట్టిందా.. సక్సెస్ అయ్యిందా చూద్దాం.
ఐపీఎల్లో ఇప్పటివరకు ఒకే రోజు రెండు మ్యాచ్లు చూశారు ప్రేక్షకులు. కానీ, ఈసారి బీసీసీఐ మాత్రం ఒక ప్రయోగం చేసింది. ఒకేరోజు ఒకే సమయానికి రెండు మ్యాచ్లు ప్రసారం చేసింది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు రెండు మ్యాచ్లను ప్రసారం చేసి పెద్ద సాహసమే చేసిందని చెప్పాలి. శుక్రవారం నాలుగు జట్లు తలపడ్డాయి. ఢిల్లీ- బెంగళూరు, ముంబయి- హైదరాబాద్ టీమ్లు ఆడాయి. అందుకు ఏర్పాట్లను కూడా చేసుకున్నారు. అభిమానుల స్థానిక భాష్లలోనూ కామెంటరీని ప్రసారం చేశారు. వారి అనుబంధ చానళ్లలో రెండు మ్యాచ్లను ప్రసారం చేశారు.
నిన్న మ్యాచ్లు చూసిన ఎవరికైనా అర్థమైపోతుంది. ఎవరికి ఎక్కువ వ్యూయర్షిప్ వచ్చిందో అని ఇట్టే చెప్పేస్తారు. నిన్న ముంబయి- హైదరాబాద్ మ్యాచ్కు హాట్స్టార్లో ఎక్కువ వ్యూయర్షిప్ వచ్చింది. ఆ మ్యాచ్ ఒకానొక సమయంలో 40 లక్షల మంది వీక్షించారు. మరోవైపు ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్కు అంత ఆదరణ దక్కలేదనే చెప్పాలి. అత్యధికంగా 11 లక్షల మంది వరకు వీక్షించారు. ఇషాన్ మెరుపు బ్యాటింగ్.. సిక్సుల వర్షం కురిపించడంతో ప్రేక్షకులు ముంబయి మ్యాచ్కే ఎక్కవ ఆకర్షితులయ్యారు. దాదాపు టీవీ రేటింగ్స్ కూడా ఈ విధంగానే ఉన్నాయి. బ్రేక్ సమయంలో స్కోర్ కోసం మాత్రమే చూసినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్నే అడుగుతున్నారు. ఎందుకు ఇలా ఒకేసారి రెండు మ్యాచ్లు ఆడించారు అని. భవిష్యత్ కార్యచరణ దృష్ట్యా బీసీసీఐ ఈ ప్రయోగం చేసింది. బయో బబుల్ వాతావరణంలో మ్యాచ్లు నిర్వహిచడం కూడా కష్టతరంగా మారడం కూడా ఇందుకు కారణం. వచ్చే సీజన్లో రెండు కొత్త ఫ్రాంచైజీలు రావడం.. మ్యాచ్ల సంఖ్య పెరగడం కూడా ఒక కారణం. ఇలా చేస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారని ఇప్పుడే ప్రయోగం చేసింది బీసీసీఐ. ఏర్పాట్లు’ పరంగా అంతా సవ్యంగా జరిగినా.. టీఆర్పీ, వ్యూయర్షిప్ పరంగా ఇది ఆదాయానికి గండికొట్టే ప్రక్రియ అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఒకేసారి రెండు మ్యాచ్లు ప్రసారం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.