ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే పోలింగ్ బూత్కు వెళ్లి గంటలకొద్ది లైన్లో నిల్చొని మరీ ఓటు వేయాల్సి వచ్చేంది. ఈ కారణం చూపి చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోరు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటింగ్ విధానంలో మార్పు తెచ్చే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటి స్మార్ట్ఫోన్తో ఇంటి నుంచే ఓటేసే విధానాన్ని తెలంగాణలో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇందుకోసం స్మార్ట్ ఫోన్ బేస్డ్ ‘ఈ-ఓటింగ్’ యాప్ని అభివృద్ధి చేశారు. ఈ యాప్ని పరీక్షించడానికి ఖమ్మం జిల్లాలో మాక్(డమ్మీ) ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఐటీ అండ్ సీ విభాగం, సీడాక్ కలిసి రూపొందించిన ఈ స్మార్ట్ ఫోన్ ఎలక్షన్ విధానాన్ని ఐఐటీ భిలాయ్ డైరెక్టర్ రజత్ మూనా అధ్యక్షతన పరీక్షించనున్నారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ఓటు నమోదు చేసుకోవాలి. 20న పోలింగ్ నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలోని పౌరులందరూ ఈ-ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. అయితే వికలాంగులు, వృద్ధులు, అత్యవసర విభాగాల సర్వీసుల్లో పనిచేసే వారు, జబ్బుపడిన వ్యక్తులు, పోలింగ్ సిబ్బంది, ఐటీ నిపుణులు వంటి వారికి ఓటేసే అవకాశం కల్పించడమే ఈ-ఓటింగ్ లక్ష్యం. ఈ విధానంలో కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడనున్నారు. ఈ టెక్నాలజీల సాయంతో మూడు సార్లు ఓటరు అథెంటిఫికేషన్ చేయనున్నారు.
ఓటరు పేరు, ఆధార్, లైవ్ లొకేషన్, ఇమేజ్ మ్యాచింగ్ వంటివి సరిచూడనున్నారు. ఇక ఈ-ఓటింగ్లో పాల్గొనాలనుకునే వారు ముందుగా ఓ యాప్ ను ముందుగాడౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని సాయంతోనే ఫొటో ఇమేజ్ ను చెక్ చేస్తారు. ఇక యాప్లోనే ఓటింగ్ నమోదు.. ఓటేసే విధానం గురించి వివరిస్తూ కొన్ని వీడియోలను కూడా ఉంచారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆన్ లైన్ ఫార్మట్ లో వేసిన ఓట్లు చెరిగిపోకుండా లెక్కించటానికి సాయపడుతుంది. ఈ మొత్తం ప్రక్రియను వెబ్ పోర్టల్ ఉపయోగించి పర్యవేక్షించవచ్చు. ఇందులో ప్రొఫెసర్ రజత్ మూనా, ఐఐటీ భిలాయ్, భారత ఎన్నికల కమిషన్ సాంకేతిక సలహాదారు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్లు పాల్గొంటారు.