జల్సాల కోసం ఈజీగా మనీ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ సాంకేతికతను అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. కాసుల కక్కుర్తిలో అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఎంత మేలు జరుగుతుందో.. అంతే నష్టం కూడా చేకూరుతుంది. సాంకేతికను వినియోగించుకుని కొంత మంది పక్కదోవ పడుతున్నారు. జల్సాల కోసం ఈజీగా మనీ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ సాంకేతికతను అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. కాసుల కక్కుర్తిలో అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి డబ్బును పోగొట్టుకున్న బాధితులు ఎందరో. అయితే ఒకేసారి డబ్బులు నొక్కేయాలనుకున్న ముగ్గురు ఆధునిక సాంకేతికను వినియోగించుకుని ఏటీఎం నుండి లక్షలు దోచేశారు. ఈ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఏటీఎం అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జరిగిన ఈ దోపిడీని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. విఎం బంజర్ ఎస్సై సూరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్లోని డీసీసీబీ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలో ఆధునిక సాంకేతికతో ముగ్గురు ఆగంతకులు డబ్బులు కాజేశారు. ఏటీఎం మిషన్ ఏ మాత్రం డ్యామేజ్ కాకపోవడంతో అందులో డబ్బులు ఉంచే సిబ్బందికి కూడా అనుమానం రాలేదు. అయితే ఏటీఎం రీకన్సలేషన్ సమయంలో నగదు లావాదేవీలకు సంబంధించి తేడాలు రావడంతో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా.. చోరీ జరిగిందనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 30వ తేదీన మొత్తం 11 సార్లు ఏటీఎం కార్డను వినియోగించి.. లక్ష పదివేల రూపాయలు విత్ డ్రా చేసినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు.
డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఏటీఎం మిషన్లో కార్డు పెట్టి ..నగదు ఎంటర్ చేసి విత్ డ్రా అయ్యే సమయానికి ఏటీఎం మిషన్ పవర్ ఆఫ్ చేశారు. అనంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డబ్బులు కాజేశారు. ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహా దొంగతనాలు జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో జరిగినట్లు తమకు పిర్యాదులు అందాయని పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సూరజ్ తెలిపారు.