హైదరాబాద్- మన దేశంలో దొంగ బాబాలకు కొదవే లేదు. బాబాల ముసుగులో కొంత మంది కేటుగాళ్లు జనాలను నిలువునా ముంచుతున్నారు. ఇంకొందరైతే బాబా వేశంలో మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. దొంగ బాబాల రాసలీలల గురించి మనం ఇంతకు ముందు చాలా ఘటనలను చూశాం. ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ లో మరో దొంగ బాబా వ్యవహారం బయటపడింది.
మంత్ర, తంత్రాల పేరుతో మాయమాటలు చెప్పి మహిళలను లొంగదీసుకుని అఘాయిత్యాలకు పాల్పడిన ఓ దొంగ బాబా బాగోతం బట్టబయలైంది. తన తల్లి వైద్యం కోసం బాబా దగ్గరకు వస్తే కూతుళ్లపై లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. తల్లికి ఆరోగ్యం బాగోకపోతే చేతబడి చేయించారని కట్టు కధలు చెప్పి కూతురిపై అత్యాచారం చేశాడా దొంగ బాబా. అంతటితో ఆగకుండా ఆమెకు తోడుగా వచ్చిన చెల్లెలిపై కూడా దారుణానికి పాల్పడ్డాడు. పాత హైదరాబాద్ లోని బస్తీ కిషన్బాగ్ కు చెందిన ఓ మహిళకు ఆరోగ్యం బాగలేకపోవడంతో 2005లో చాంద్రాయణగుట్టకి చెందిన భూత వైద్యుడు సయ్యద్ హసన్ అక్సారీ వద్దకు తీసుకువచ్చారు.
ఆమెకు తాయత్తులు కట్టి వైద్యం చేసినట్లు నమ్మించాడా దొంగ బాబా. మామూలుగానే ఆమెకు ఆరోగ్యం కుదుటపడటంతో ఈ బాబాపై వారికి నమ్మకం పెరిగింది. ఈ క్రమంలో వారి కుటుంబంలో ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా ఆ బాబా దగ్గరకే వచ్చేవారు. ఈ క్రమంలో ఆ మహిళ పెద్ద కూతురుకి పెళ్లైంది. ఆమె కుటుంబంలో గొడవలు, అనారోగ్యం చేయడంతో.. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ దొంగ బాబా.. భర్తే క్షుద్రపూజలు చేయించాడని నమ్మించి ఆ మహిళ కూతురుకు విడాకులు ఇప్పించాడు.
ఇక అనారోగ్యంతో ఉన్న ఆమె బాబా దగ్గరకు రావడంతో, ఆమెకు భూతం పట్టిందని చెప్పి అత్యాచారం చేశాడు. అదిగో అప్పటి నుంచి నాలుగేళ్లుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. వాళ్లు ఉంటున్న ఇళ్లు వాస్తు కలిసి రావడం లేదని నమ్మించి, ఆ ఇంటిని కూడా అమ్మించేసి వచ్చిన డబ్బులు కూడా కొట్టేశాడు. ఆమెకి తోడుగా వస్తున్న చెల్లెలిపై కన్నేసిన దుర్మార్గుడు అక్క భర్త ఆమె చెల్లిపై కూడా క్షుద్రపూజలు చేయించాడని నమ్మించాడు.
ఆమెను కూడా భయపెట్టి లొంగదీసుకుని, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక్కడ మరో ఘోరం ఏంటంటే.. ఈ దొంగ బాబా కొడుకు సయ్యద్ అఫ్రోజ్ కూడా బాధితురాలి చెల్లెలిై అత్యాచారం చేశాడు. ఇన్నాళ్లు మౌనంగా భరించిన బాధితులు, విసుగు చెంది చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించడంతో దొంగ బాబా కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రీ కొడుకులను అరెస్టు చేశారు.