సినిమా ఫక్కీలో కొద్ది క్షణాల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి.. తల్లిదండ్రులకు, పీటలపై కూర్చున్న కాబోయే భర్తకు షాకిచ్చింది. పెళ్లి చీరకట్టుకునేందుకు గదిలోకి వెళ్లిన వధువు అటునుంచి అటే పారిపోయి, ప్రియుడితో పెళ్లి చేసుకుంది. ఈ ఘటన మదనపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. మదనపల్లె మండలం తట్టివారిపల్లెకు చెందిన రామకృష్ణ, మల్లిక దంపతుల కుమార్తె సోనికకు పట్టణంలోని సొసై టీ కాలనీలో ఉంటున్న ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది.
శని, ఆదివారాల్లో పెళ్లి జరిగేలా పెద్దలు నెల రోజుల క్రితం పత్రిక రాయించుకున్నారు. శనివారం రాత్రి రిసెప్షన్ జరిగింది. ఆదివారం పెళ్లి మహూర్తానికి పెళ్లికూతురు, పెళ్లికొడుకుతోపాటు బంధువులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఉదయం 5.30 గంటలకు ముహూర్తం కాగా ఆ సమయానికి పెళ్లి చీర కట్టుకునేందుకు సోనిక గదిలోకి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం గొల్లపల్లెకు చెందిన తన ప్రియుడు చరణ్తో పుంగనూరుకు వెళ్లి ఓ గుడిలో వివాహం చేసుకుంది. పెద్దలతో తనకు ప్రమాదం ఉందని మదనపల్లె టూటౌన్ పోలీసులను ఆశ్రయించింది.
కాగా పెళ్లికొడుకు బంధువులు తాము పెళ్లి కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టామని, తమకు అవమానం జరిగిందని పెద్దలతో కలిసి టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. కాగా సోనిక ఎంబీఏ చదివి, స్థానిక గురుకుల పాఠశాలలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని సోనిక ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేసింది.