మధ్యప్రదేశ్ (నేషనల్ డెస్క్)- భారత్ ఒకప్పుడు నిరుపేద దేశం. కానీ క్రమ క్రమంగా దుగుతూ ఇప్పుడు అభివృద్ది చెందుతున్న దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. రోజు రోజుకు మన దేశంలో పేదరికం తగ్గిపోతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ కరోనా నేపధ్యంలో మరోసారి భారత్ లో పేదరికం ఎంత దుర్బరంగా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన మన దేశంలో ప్రజలు ఎంత దౌర్బాగ్య పరిస్థితుల్లో బతుకుతున్నారో తెలియజేసింది. చనిపోయిన తన కూతురు శవానికి పోస్ట్మార్టం చేయించడానికి వాహనం మాట్లాడుకునే ఆర్థిక స్థోమత కూడా లేని ఓ వ్యక్తి.. మంచంపై కూతురు శవాన్ని మోస్తూ 35 కిలోమీటర్లు నడిచి వెళ్లాడు. మధ్యప్రదేశ్లోని సింగురౌలి జిల్లాలో జరిగింది ఈ సంఘటన. మే 5వ తేదీన 16 ఏళ్ల అమ్మాయి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుంది. అయితే పోలీసులు విచారణ నిమిత్తం మృతురాలి ఇంటికి వచ్చి పోస్ట్మార్టం తప్పకుండా చేయాలని, మృత దేహాన్ని ఆస్పత్రికి తీసుకురావాలని తండ్రి దిరాపతి సింగ్ కు హకూం జారీ చేశారు.
పోస్ట్ మార్టం చేయాలంటే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్కు వెళ్లాలి. కానీ అక్కడి వరకు అంబులెన్స్ గాని, మరేదైనా వాహనం తీసుకెళ్లే ఆర్థిక స్థోమత చనిపోయిన అమ్మాయి తండ్రి దిరాపతి సింగ్ కు లేదు. దీంతో స్థానికుల సాయంతో మంచంపై కూతురి శవాన్ని వేసుకుని మరో వ్యక్తి సాయంతో 35 కిలోమీటర్ల నడిచి వెళ్లాడు. ఉదయం 9 గంటలకు కూతురు శవాన్ని తీసుకుని బయలుదేరితే సాయంత్రం 4 గంటలకు అతడు ఆస్పత్రికి చేరుకున్నాడు. తనకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, కూతురు మృతదేహాన్ని మోసి తను బాగా అలసిపోయానని ధీనంగా చెప్పాడు దిరాపతి సింగ్. ఈ ఘటన నేపధ్యంలో పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే ఇలాంటి వాటికి తమ డిపార్ట్ మెంట్ నిధులను కెటాయించలేదని, అందుకే వాహనాన్ని ఏర్పాటు చేయలేకపోయామని పోలీస్ అధికారి అరుణ్ సింగ్ వివరణ ఇచ్చారు. ఆ తండ్రి.. కూతురు మృతదేహాన్ని మంచంపై మోసుకెళ్లడాన్ని సోషల్ మీడియాలో చూసిన వాళ్ల హృదయాలను కలిచివేస్తోంది.