బ్యాట్ పట్టి సిక్సు కొట్టినా.. పాట పెట్టి స్టెప్పు లేసినా.. టిక్ టాక్లో డైలాగ్ చెప్పినా అది మన డేవిడ్ వార్నర్కే చెల్లుతుంది. ‘సన్రైజర్స్ హైదరాబాద్’ టీమ్కు అతడో స్టార్ ప్లేయర్.. అతను క్రీజులో ఉంటే హైదరాబాద్ ఖాతాలో విజయం నమోదైనట్లే.. ఇవన్నీ అభిమానులు ఇప్పటికీ నమ్ముతున్న మాటలు. కానీ, హైదరాబాద్ జట్టు యాజమాన్యం మాత్రం అతని ప్రదర్శనపై ఎంతో నిరాశగా ఉంది. అందుకే కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్లోనే లేకుండా చేసింది. అందుకు కూడా వార్నర్ బాధ పడలేదు. ఐపీఎల్ 2021 ఫస్టాఫ్లో ఓ మ్యాచ్లో ఆటగాళ్లకు డ్రింక్స్ కూడా మోశాడు. ఎక్కడా జట్టుపై, యాజమాన్యంపై ఒక్క విమర్శ చేయలేదు. జట్టు అతడ్ని వద్దనుకున్నా.. జట్టును మాత్రం అతడు ఎప్పుడూ వద్దనుకోలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్ పుణ్యామా అని వార్నర్కు హైదరాబాద్, ఇండియాతో విడదీయరాని బంధం ఏర్పడింది. అతను ఎప్పుడూ భారతదేశాన్ని తన ఇంటిగానే భావిస్తాడు. ఒక్క ఆస్ట్రేలియా మినహా ఏ దేశంతో టీమిండియా మ్యాచ్ ఆడుతున్నా.. అతను డౌట్ లేకుండా భారత్కే మద్దతు తెలుపుతాడు. తెలుగువారితో వార్నర్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్ లేకపోయినా.. సోషల్ మీడియా వేదికగా వార్నర్ ఎప్పుడూ తెలుగువారితో టచ్లో ఉంటాడు. ఆరంజ్ ఆర్మీ అభిమానులకు ఇన్స్టాలో రిప్లయిలు ఇస్తూ ఉత్సాహపరుస్తాడు. తెలుగులో అందరు అగ్రహీరోలా పాటలకు డాన్సులు, ఫేస్ యాప్తో సినిమా సీన్స్ చేసిన వార్నర్ తెలుగువారి అభిమానాన్ని చూరగొన్నాడు.
2014లో డేవిడ్ వార్నర్ హైదరాబాద్ టీమ్లోకి ఎంటర్ అయ్యాడు. 2015లోనే వార్నర్కు హైదరాబాద్ టీమ్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అదే జోరులో సన్రైజర్స్ హైదరాబాద్కు తొలి ఐపీఎల్ ట్రోఫీని అందించింది వార్నరే. 2014లో 528 పరుగులు, 2015లో 562, 2016లో 848, 2017లో 641, 2019లో 692, 2020లో 548 పరుగులు చేశాడు వార్నర్. వరుసగా ఆరు సంవత్సరాలు 500 పరుగులు పైగా సాధించాడు. మూడుసార్లు ఆరంజ్ క్యాప్ సాధించాడు. 2021లో 8 మ్యాచ్లలో 107.73(వార్నర్ కెరీర్లోనే అత్యల్పం) స్ట్రైక్ రేట్ 195 పరుగులు చేశాడు. ఒక్క సీజన్లో ప్రదర్శన బాలేదని కెప్టెన్సీ తీసేయడం.. టీమ్ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి వ్యతిరేకత మొదలైంది. సోషల్ మీడియా వేదికగా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
డేవిడ్ వార్నర్ సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్కు గుడ్ బై చెప్పేస్తున్నాడని టాక్ మొదలైంది. ఐపీఎల్ 2022 ఆక్షన్ రూల్స్ ప్రకారం గరిష్టంగా ఇద్దరు విదేశీ ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సన్రైజర్స్ హైదరాబాద్ కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్లను రిటైన్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి డేవిడ్ వార్నర్ వేలంలోకి వస్తే దక్కించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయత్నిస్తోందని సమాచారం. ఎలాగైనా వార్నర్ని దక్కించుకోవాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తున్నట్లు అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి. వచ్చే సీజన్లో కెప్టెన్గా కోహ్లీ తప్పుకుంటున్నా అన్న తర్వాత.. ఆర్సీబీ వార్నర్ కోసం చూస్తుందంటే.. నెక్స్ట్ కెప్టెన్ వార్నర్ అవుతాడా అంటూ అప్పుడే ప్రశ్నలు మొదలయ్యాయి.
డేవిడ్ వార్నర్ విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం సరైన నిర్ణయమే తీసుకుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.