Swiggy Boy: ఫుడ్ డెలివరీ బాయ్స్పై దాడులు నానాటికి పెరిగిపోతున్నాయి. కొంతమంది కారణం లేకుండానే డెలివరీ బాయ్స్పై దాడులకు పాల్పడుతున్నారు. డెలివరీ బాయ్స్ అంటే కొంచెం కూడా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదవి గతి లేక ఫుడ్ డెలివరీ బాయ్స్గా మారుతున్న వారిని నలుగురి ముందు కన్నీళ్లు పెట్టిస్తున్నారు. తాజాగా, ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి స్విగ్గీ డెలివరీ బాయ్పై అనవసరంగా దాడికి పాల్పడ్డాడు. నోటికి వచ్చినట్లు తిట్టి, కొట్టాడు. ఈ సంఘటన తమిళనాడులో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మోహన సుందరం స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు.
శనివారం 5:30 – 6 మధ్యలో ఫుడ్ డెలివరీ చేయటానికి ఫన్ మాల్ దగ్గర నిల్చుని ఉన్నాడు. ఈ సమయంలో నేషనల్ మోడల్ స్కూల్కు చెందిన ఓ బస్సు ఓ మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లసాగింది. మోహన్ సుందరం ఆ బస్సును ఆపి, డ్రైవర్ను ప్రశ్నించాడు. అప్పుడు ఓ ట్రాఫిక్ పోలీస్ మోహన సుందరం దగ్గరకు వచ్చాడు. కారణం లేకుండానే దాడి చేయటం మొదలుపెట్టాడు. ‘‘నువ్వే మన్నా పోలీసువా?.. లేక వీఐపీవా?.. నేషనల్ మోడల్ స్కూల్ బస్సును ఎలా ఆపుతావు?.. నువ్వేమన్నా రౌడీవా?.. అంటూ చెంపలు రెండు వాయించాడు. సుందరం హెడ్ సెట్ను కూడా పక్కకు తీసి పారేశాడు. అతడి సెల్ఫోన్, బైక్ తాళం చెవి లాక్కుని అక్కడినుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటనపై మోహన సుందరం మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు. తను పెద్ద చదువులు చదివి ఏ పరిస్థితుల్లో ఫుడ్ డెలివరీ బాయ్గా చేరాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. మోహన సుందరం మాట్లాడుతూ.. ‘‘ ఆ ట్రాఫిక్ పోలీస్ నన్ను బాగా కొట్టాడు. నా దగ్గర ఆసుపత్రికి పోవటానికి కూడా డబ్బులు లేవు. నిన్న నా దగ్గర 500 రూపాయలు ఉండె. 200 రూపాయలకు పెట్రోల్ కొట్టించాను. దాడి తర్వాత 300 రూపాయలతో ఇంటికి పోయాను. నేను ఇంట్లో కూడా దీని గురించి చెప్పలేదు. నేను పార్ట్టైంగా ఈ పని చేస్తున్నాను. నాకు స్టేషనరీ షాపు ఉంది. షాపు సరిగ్గా నడవటం లేదు. స్టేషనరీ షాపు బాడుగ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు.
తినడానికి కూడా డబ్బులు లేకపోవటం వల్ల.. గతి లేక స్విగ్గీలో చేరాను. దీంతో వచ్చిన డబ్బులో బాడుగ కట్టి షాపు నడుపుతున్నాను. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లు స్విగ్గీలోకి వస్తున్నారు. నేను ఇదివరకు జీఆర్డిజైర్ బోర్డు అనే కంపెనీలో పర్చేజ్ ఇంఛార్జ్గా పనిచేశాను. పీఐడి ఐటీ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాను. అక్కడ పనిచేస్తే స్టేషనరీ షాపును, నా పిల్లల్ని చూసుకోవటానికి కుదరటం లేదు. అందుకే జాబ్ మానేశాను’’ అంటూ తన కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి, మోహన సుందరం కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Uttar Pradesh: ఫోటో గ్రాఫర్ రాలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు!