పెళ్లి అంటే జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక అని భావిస్తుంటారు. దాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా మలుచుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. డబ్బున్న మారాజులు ఏం చేసినా పర్లేదు.. కానీ వారిని చూసి సామాన్యులు కూడా ఆడంబరాలకు పోయి అప్పులపాలవుతున్నారు. ముఖ్యంగా పెళ్లి విందులో ఎన్ని రకాల వంటలు వడ్డిస్తే.. అంత గొప్ప అని ఫీలవుతున్నారు. పలు రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొండెక్కిన నిత్యవసరాల ధరలు, కూరగాయల ధరలతో ఈ విందు సామాన్యుల పాలిట పెను భారంగా మారింది.
అందులోనూ తినుబండారాలు, కూరలు, వంటలు ఎక్కువగా చేసే ముస్లిం ఇళ్లల్లో పెళ్లిళ్లకు ఖర్చు మరీ ఎక్కువవుతుంది. రానురాను ఈ వివాహ విందు ఖర్చు పెరిగిపోతుండటంతో ఆడపిల్లల కుటుంబాలను ఖర్చు బాధల నుంచి బయటపడేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన మతపెద్దలంతా కలిసి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏ పెళ్లి అయినా సరే ఒకటే కూర, ఒకటే స్వీటు ఉండాలని తీర్మానించుకున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో పెళ్లిలో అమ్మాయి తరఫు వారు రకరకాల వంటకాలతో భారీ ఎత్తున విందు ఏర్పాటు చేస్తారు. పెళ్లికూతురుకు పుట్టింటి వారు కట్నకానుకలు లేదా సారె కింద ఇచ్చే వాటి కంటే ఈ విందులో వడ్డించే వెరైటీల ఖర్చు అనేక రెట్లు అధికమైంది. ఎంత తక్కువ వెరైటీలు ప్లాన్ చేసినా.. ఎంతలేదన్నా.. రూ. 3-4 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అయితే కరోనా కారణంగా చాలా మంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా తయారయ్యింది. ఈ క్రమంలో పెళ్లి విందు ఖర్చుపై పేద, సామాన్య ముస్లిం కుటుంబాల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
భగారా, చికెన్ లేదా మటన్, ఒక స్వీట్
వివాహంలో పెరుగుతున్న విందు ఖర్చును నియంత్రించేందుకు ఇటీవల వేములవాడలోని షాదీఖానాలో 8 మజీద్ కమిటీల పెద్దలు సమావేశమయ్యారు. స్థానికంగా జరిగే విందుల్లో భగారాతో పాటు ఒకటే కూర చికెన్ లేదా మటన్ మాత్రమే వడ్డించాలని తీర్మానించారు. గతంలో మాదిరి గంపెడు స్వీట్లు చేయకుండా ఏదైనా ఒకే స్వీటు పెట్టాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానం ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హార్షం వ్యక్తం అవుతోంది. మతంతో పని లేకుండా అందరు దీన్ని పాటిస్తే.. చాలా బాగుంటుందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.