కరోనా కారణంగా దేశంలోని అన్ని రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వాటిలో టీఎస్ఆర్టీసీ కూడా ఒకటి. దానికి తోడు.. తాజాగా పెరుగుతున్న డీజిల్ ధరలు ఆర్టీసీకి మరిన్ని నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుత తరుణంలో బస్ చార్జీలు పెరిగితే తప్ప.. ప్రగతి రథ చక్రం ముందుకు సాగే పరిస్థితిలో లేదు. చార్జీల పెంపు గురించి ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినా.. ఇంతవరకు ఆమోదం లభించలేదు. ఫలితంగా రోజు రోజుకు నష్టాలు పెరుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా డైరెక్ట్గా చార్జీలు పెంచకుండా.. ఇతరాత్ర రుసుములు, ఫీజులను పెంచడం ద్వారా ఎక్కెడెక్కడ చార్జీలను పెంచుకునే అవకాశం ఉందో అక్కడ పెంపుకు ప్రయత్నిస్తోంది టీఎస్ఆర్టీసీ.
చూడటానికి ఇవన్ని చిన్నచిన్న రుసుములే అయినా అన్నీ కలిపేసరికి ప్రయాణికుల జేబుకు బాగానే కత్తెర పడుతోంది. ఇతర పట్టణాల నుంచి నగరానికి వచ్చే బస్సుల్లో చార్జీ కేటగిరీల వారీగా కొన్ని రోజుల వ్యవధిలోనే రూ.10–20 వరకు పెరిగిపోయింది. ఇవేవీ అధికారికంగా వెల్లడించకుండా, అంతర్గత నిర్ణయాలతో ఆర్టీసీ పని కానిచ్చేస్తోంది. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, వాటికి అనుగుణంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సగటు జీవిపై, చార్జీల్లో ‘అనధికార పెంపు’ మరింత భారం మోపుతోంది.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు RTC షాక్.. భారీగా చార్జీలు పెంపు..!ప్రతి టికెట్పై రూపాయి చొప్పున చార్జీ విధించింది. వినడానికి అది చిన్న మొత్తమే.. కానీ, ఆ రూపాయి విధింపుతో మారిన టికెట్ చార్జీలు కండక్టర్లకు–ప్రయాణికుల మధ్య చిల్లర తగాదాలకు కారణమవుతుందని చెప్పి చార్జీని రౌండ్ ఆఫ్ చేసింది. అంటే రూ.15, రూ.20, రూ.25, రూ.30… ఇలా అన్నమాట. దీంతో నిర్ధారిత స్టేజీల తర్వాత రూపాయి చార్జీ కాస్తా రూ.5కు పెరిగిపోయింది.
వసతుల సెస్…
సేఫ్టీ సెస్ విధించి ఐదారురోజులు గడవకముండే ఆర్టీసీ సెస్ విధించింది. బస్టాండ్లలో ప్రయాణికులకు వసతులు మెరుగుపరిచే ఉద్దేశంతో 2013లో ప్రారంభించిన ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్ను సవరించేసింది. పల్లె వెలుగు మినహా ఇతర కేటగిరీ బస్సుల్లో టికెట్పై రూపాయిగా ఉన్న సెస్ను ఒకేసారి రూ.5కు పెంచేసింది. అంటే కొత్తగా రూ.4 పెరిగిందన్నమాట. ఇప్పుడు బేస్ టికెట్ ఫేర్లో దీన్ని కూడా చేర్చి టికెట్ ధరలను రౌండాఫ్ చేసింది. ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సుల్లో తదుపరి రూ.5కు (ధర రూ.21 ఉంటే రూ.25కు), సూపర్ లగ్జరీ నుంచి ఆ పై కేటగిరీ సర్వీసుల్లో రూ.10కి రౌండాఫ్ (టికెట్ ధర రూ.21 ఉంటే రూ.30కి) చేసింది. ఈ కొత్త చార్జీలు ఆదివారం ఉదయం నుంచి అమల్లోకి తెచ్చింది.
రౌండాఫ్తో పెరిగిన భారం1.రెండు సెస్లు కలిపి రూ.5 మేర మాత్రమే విధిస్తున్నట్టు కనిపిస్తున్నా.. రౌండాఫ్ వల్ల టికెట్ ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పు చోటుచేసుకుంది.
2.నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు రూ.195గా ఉన్న ఎక్స్ప్రెస్ చార్జీ ఇప్పుడు రూ.205కు, రూ.270గా ఉన్న సూపర్ లగ్జరీ చార్జీ రూ.280కి, రూ.330గా ఉన్న రాజధాని చార్జీ రూ.350కి చేరింది.
3.కరీంనగర్ నుంచి హైదరాబాద్కు రూ.175గా ఉన్న ఎక్స్ప్రెస్ చార్జీ రూ.190కి, రూ.220గా ఉన్న సూపర్లగ్జరీ చార్జీ రూ.235కు, రూ.305 గా ఉన్న రాజధాని చార్జీ రూ.320కి చేరింది.
4.వరంగల్ నుంచి హైదరాబాద్కు… రూ.190గా ఉన్న డీలక్స్ చార్జీ రూ.200కు, రూ.215గా ఉన్న సూపర్లగ్జరీ చార్జీ రూ.230కి, రూ.295గా ఉన్న రాజధాని చార్జీ రూ.310కి పెరిగింది.
ఇది కూడా చదవండి: వామ్మో.. సజ్జనార్ క్రియేటివిటీకి నెటిజన్ల ఫిదా.. వీడియో వైరల్!
ఇవే కాక త్వరలోనే సమాచార సెస్ విధించేందుకు కూడా ఆర్టీసీ రంగం సిద్ధ చేస్తోంది. అలానే నాలుగు రోజుల క్రితం బస్ పాస్ చార్జీలను కూడా పెంచింది. ఇంధన ధరలలో పాటు ఇప్పుడు ఈ బస్ చార్జీలు కూడా పెరగడం సామాన్యుడికి మరింత భారంగా మారుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో పెళ్లి మండపానికి యువ IAS..!