‘చలానాలు చెల్లించకుంటే వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు’ అని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు స్పందించారు. ఇటీవల చలానా ఉన్నా.. వాహనాలు సీజ్ అధికారం పోలీసులకు లేదంటూ పోస్టులు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అలాంటి వార్తలపై సైబరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. కేంద్ర మోటారు యాక్టు 167వ రూల్ ప్రకారం చలానాలపై వాహనదారుడు 90 రోజుల్లోగా స్పందిచకపోతే, అలాంటి వాహనాలను సీజ్ అధికారం తమకు ఉందంటూ స్పష్టం చేశారు.
తెలంగాణ హైకోర్టు అలాంటి ఆదేశాలను ఇవ్వలేదని తెలిపారు. కొంత మంది ఉద్దేశపూర్వకంగా ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని వివరించారు. ‘‘ఓ న్యాయవాది తన వాహనాల చలానాలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేయగా.. సీజ్ చేసిన సదరు అడ్వొకేట్ వాహనాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతూ రెండు వారాల్లో పోలీసులకు లేఖ రాయాలని కోర్టు సూచించింది. పోలీసులు దాన్ని పరిశీలించి, 8 వారాల్లోపు వాహనాన్ని తిరిగి ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది’’ అని తెలిపారు. నిజానికి సదరు అడ్వొకేట్ ఈ నెల 19న రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసుల ముందు హాజరై.. పెండింగ్ చలానాలను చెల్లించి, వాహనాన్ని విడిపించుకున్నారని చెప్పారు.
పోలీసులకు వాహనాలను జప్తు చేసే అధికారంపై వైరల్ అయిన పోస్టులపై న్యాయవాది నిఖిలేశ్ వివరణ ఇచ్చారు. ‘నేను హైకోర్టును ఆశ్రయించిన విషయం వాస్తవమే. 11న హైకోర్టు ఆ పిటిషన్ను డిస్పోస్ చేసింది. కాంటెస్ట్ చేయడం ఇష్టం లేక.. నేను 19వ తేదీన చలానాలు చెల్లించి, నా వాహనాన్ని విడిపించుకున్నాను. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులకు నేను బాధ్యుడిని కాదు. అందులో నా ప్రమేయం లేదు. న్యాయ, పోలీసు వ్యవస్థలను కించపరిచే ఉద్దేశం నాకు లేదు’ అని న్యాయవాది నిఖిలేశ్ స్పష్టం చేశారు.
వాహనదారులు ఎప్పటికప్పుడు చలానాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఆర్టీఏ, రాష్ట్ర పోలీసు వెబ్సైట్లలో మొబైల్ నంబర్ను అప్డేట్ చేస్తే.. చలానాలు జనరేట్ అయినప్పుడు వారి ఫోన్కు సందేశాలు వస్తాయని చెప్పారు. అలాగే, కొన్ని సందర్భాల్లో తమ ప్రమేయం లేకుండా చలానాలు పడుతూ ఉంటాయి. సాంకేతికంగా మరెలా అయినా తప్పుడు చలానాలు ఉంటే.. దానిపై ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉందన్నారు. తప్పుడు చలానాలపై వెంటనే స్పందించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.