విద్యుత్ అధికారులు అప్పుడప్పుడు చేసే తప్పులు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా కరెంట్ బిల్లులు ఇచ్చే సమయంలో పేదవారికి షాక్ ఇస్తుంటారు. చిన్న ఇళ్లకు సైతం భారీ బిల్లులు వేసి..పేదవారిని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి నివాసం ఉంటున్న రెండు గదుల రేకుల షెడ్ ఇంటికి ఏకంగా రూ.87 వేలు, మరొక ఇంటికి రూ.88 వేల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆ బిల్లు చూసి షాకైన ఆ ఇళ్ల యజమానులు.. ఇవి అమ్ముకున్న అంత రాదని వాపోయారు. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చింతపల్లి కి చెందిన నల్లవెళ్లి పుల్లయ్య ఇంటికి జూలై 16 నుంటి ఆగష్టు 5 వరకు 8672 యూనిట్లు వాడినట్లు రూ.87,338 బిల్లు వేశారు. అదే విధంగా నల్లవెళ్లి నిరంజన్ ఇంటికి 20 రోజులకు 8793 యూనిట్లు వాడినట్లు రూ.88,368 బిల్లు వేశారు. రెండు బల్పులు, ఒక ఫ్యాన్ ఉండగా రూ. వేలల్లో బిల్లులు ఎలా వేస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దళితలకు ఉచిత కరెంట్ అనే కారణంతో కొన్ని ఏళ్లుగా విద్యుత్ అధికారులు రీడింగ్ తీయలేదని.. వాటన్నింటిని ఇప్పుడు తమకు వేసి.. బిల్లు చెల్లించాలంటే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇల్లు అమ్మినా కూడా అంత డబ్బులు రావన్ని పుల్లయ్య కుమారుడు సైదులు వాపోయారు.
ఈ విషయంపై అధికారులను అడగ్గా.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, ఇంత బిల్లు రావడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు సైదులు. దీనిపై ఏఈని కొందరు సంప్రదించగా… గతంలో పనిచేసిన సిబ్బంది నెలనెలా రీడింగ్ తీయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని.. సమస్యను పరిష్కరించేందుకు చర్య తీసుకుంటామని తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.