తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. వరద నీటితో రోడ్లు జలమయమవుతున్నాయి. దీంతో రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్న వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఆ వరద నీటి ప్రవాహ వేగానికి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ఇటీవలే పలు చోట్ల వాహనాలు అదుపు తప్పి వరద ప్రవాహంలో చిక్కుకున్న ఘటనలు మనం చూశాం. తాజాగా తెలంగాణలోని జనగామ జిల్లాలో వరద ప్రవాహానికి బండి అదుపు తప్పింది. ఈ ఘటనలో ఓ మహిళ వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే స్థానికులే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఆ మహిళను చాకచక్యంగా కాపాడారు.
ఆలేరు కొలనుపాక మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఓ మహిళా టీచర్ స్కూటీపై వాగు దాటుతుండగా అదుపు తప్పి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆమె భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు గమనించారు. వెంటనే స్థానికులు స్పందించి ఆ టీచర్ను కాపాడారు. ఎంతో చాకచక్యంగా ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత ఆమె బండిని కూడా బయటకు లాగారు. దీంతో ఆ మహిళా టీచర్ ఊపిరి పీల్చుకున్నారు. స్కూటీపై బచ్చన్నపేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి మహిళా టీచర్ను కాపాడిన స్థానికులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.