ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నట్లు తెలిపింది.
తెలంగాణలో పోడు భూముల సమస్య చాన్నాళ్లుగా రైతులను వేధిస్తోంది. ఈ భూముల విషయంలో అధికారులు, అన్నదాతల మధ్య వాగ్వాదాలు, గొడవలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. అనేక చోట్ల పోడు భూముల కోసం రైతులు నిరసనలు తెలిపిన ఘటనల్ని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే మొత్తానికి పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనేక ప్రాంతాల్లోని గిరిజనులకు పోడు భూములు పంపిణీ చేసే కార్యక్రమానికి కేసీఆర్ సర్కారు ఇటీవలే శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని లక్షన్నర మంది గిరిజనులకు 4 లక్షర 6 వేల ఎకరాల పట్టాలు పంపిణీ చేశారు. దీంతో రైతుల ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఇప్పుడు వారికి కేసీఆర్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.
పోడు భూముల పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. పోడు భూముల రైతులకు జులై 5వ తేదీ నుంచి రైతుబంధు సాయం అందేలా సర్కారు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అధికారులు జులై 4వ తేదీ వరకు వివరాలను నమోదు చేయనున్నారు. అన్నదాతల పేర్లు, పట్టా నంబర్, భూమి విస్తీర్ణం, మొబైల్ నంబర్ వంటి వివరాలు సరిచూసుకొని 5వ తేదీ నుంచి రైతుబంధు డబ్బులను ఖాతాల్లో జమ చేయనున్నారు. కాగా, పోడు భూముల మీద గతంలో ఉన్న కేసులను రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పట్టాలు ఇచ్చిన అనంతరం కేసులు ఉండటం సరికాదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర డీజీపీకి ఈ మేరకు ఆదేశాలు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.