ప్రముఖ ఉద్యమ గాయకుడు, తెలంగాణ జానపద గాయకుడు సాయిచంద్ గుండెపోటుతో మరణించారు. సాయిచంద్ మృతితో తెలంగాణ కళాకారులు, నేతలు శోకసంద్రంలో మునిగిపోయారు.
తెలంగాణ సాధనలో ఉద్యమం ఎంత కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ ఉద్యమానికే ఊపిరి పోసినటువంటి వ్యక్తి సాయిచంద్. తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గుర్రంగూడ సాయిచంద్ (39) గుండెపోటుతో మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని కారుకొండ ఫామ్ హౌస్ కి నిన్న కుటుంబ సభ్యులతో వెళ్లిన సాయిచంద్.. అర్ధరాత్రి సమయంలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థి దశ నుంచే గాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న సాయిచంద్.. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిలించారు. జానపద పాటలతో సాగే పలు టీవీ షోలలో కూడా సాయిచంద్ సందడి చేశారు.
ఉద్యమ కళాకారుడిగా గుర్తింపు పొందిన సాయిచంద్ కు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ పదవి ఇచ్చింది. ఇటీవల జరిగిన అమరవీరుల జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ సాయిచంద్ కనిపించారు. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలోనూ, ప్రతీ సభలోనూ సాయిచంద్ పాట వినిపించేది. అయితే ఇప్పుడు ఆ గొంతు మూగబోయిందని తెలిసి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, నెట్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి బీఆర్ఎస్ నేతలు చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సాయిచంద్ నివాసానికి తరలిస్తున్నారు. చిన్న వయసులోనే సాయిచంద్ మరణించడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.