ఇటీవల విజయవాడలో ఓ మహిళ పట్టపగలు నడుస్తున్న బస్సును ఆపి, క్యాబిన్ మీదికి ఎక్కి.. డ్రైవర్ ను కాలితో తన్ని.. చెంప పగలగొట్టి, చొక్కా చింపి…వీరంగం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఇటాంటి ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ పై ఉపాధ్యాయురాలు దాడి చేసిన ఘటన సోమవారం జరిగింది. దీనితో డ్రైవర్, ఉపాధ్యాయురాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
గద్వాల జిల్లా నుండి ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం కర్నూల్కి బయలుదేరుతుండగా, ఎర్రవల్లి చౌరస్తా వద్ద ఒక ఉపాధ్యాయురాలు ఆ బస్సు ఎక్కింది. ఆమె బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ గేర్ మారుస్తుండగా అనుకోకుండా పొగలు రావడంతో ఒక్కసారిగా భయపడింది. డ్రైవర్ కావాలనే అలా చేశాడని.. అతని వల్ల ప్రమాదం జరగవొచ్చిని భావించి గొడవకు దిగింది. ఇద్దరి మద్య మాటా మాటా పెరిగిపోవడంతో ఆమె వద్ద ఉన్న గొడుగు తీసుకొని డ్రైవర్ పై దాడి చేసింది. ఈ విషయం తోటి ప్రయాణీకులు తెలిపారు. గొడవ పెద్దది కావడంతో ఇరువురు ఎర్రవల్లి పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ… తాను ప్రతిరోజూ ఇదే బస్సులో ప్రయాణిస్తానని.. కొన్ని రోజులగా డ్రైవర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. తనను అసభ్యంగా తిట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తనపై అందరూ చూస్తుండగానే అకారణంగా దాడి చేసిందని ఆమెపై చర్యలు తీసుకోవాలని డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు కోసం వివరాలు సేకరిస్తున్నారు.