పాఠశాలకు వెళ్లే సమయంలో తెలిసీ తెలియక కొంతమంది విద్యార్థులు చెడు అలవాట్లకు దగ్గరవుతుంటారు. కొన్నిసార్లు బీడీలు, సిగిరెట్లు తాగడం లాంటివి చేస్తుంటారు. ఈ విషయం ఉపాధ్యాయులకు తెలిస్తే అలా చేయద్దు అంటూ ఆ విద్యార్థిని మందలిస్తారు. అలా చేసేది భవిష్యత్ లో మీరు చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు అని. అలా ఓ విద్యార్థి బీడీలు తాగుతున్నాడని తెలిసి విద్యార్థిని మందలించామన్నారు. అయితే ఆ విద్యార్థి చేసిన పనికి అంతా షాకయ్యారు. టీచర్లు మందలించారని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా బల్కూరు మండలం పోలిశెట్టిపల్లిలో ఈ ఘటన వెలుగు చూసింది. పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాశ్ అనే కుర్రాడు ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల ప్రాంగణంలో ఉన్న హాస్టల్ లోనే ఉంటున్నాడు. అయితే ఆకాశ్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని చెబుతున్నారు. బీడీలు, సిగిరెట్లు తాగుతూ పాఠశాల సిబ్బందికి కనిపించాడని ఆరోపించారు. ఈ విషయం ప్రిన్సిపాల్ దృష్టికి వెళ్లగా విద్యార్థిని మందలించినట్లు చెబుతున్నారు.
ఇదే విషయాన్ని ఆకాశ్ తల్లికి ఫోన్ ద్వారా తెలియజేశామన్నారు. అయితే సంక్రాంతి సెలవులు ఉన్నందున ఆకాశ్ ను ఇంటికి తీసుకెళ్లి అర్థమయ్యేలా చెప్తానని ఆవిడ చెప్పారన్నారు. అయితే ఆకాశ్ స్కూల్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్తాపంతోనే ఇలా చేసినట్లు భావిస్తున్నారు. అయితే ఆకాశ్ పేరెంట్స్ స్కూల్ సిబ్బంది వల్లే ప్రాణాలు తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. స్కూల్లో వసతుల గురించి, భోజనం నాణ్యత లేదని తమకు ఫోన్లో చెప్పినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రార్థన సమయంలో టై కట్టుకోకుండా వచ్చినందుకు తమ కుమారుడిని అందరి ముందు తిట్టి గంటపాటు నిల్చోబెట్టారని.. ఆ మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న తమ కుమారుడు స్కూల్ వారి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ నిరనకు కూడా దిగారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నట్లు తెలుస్తోంది.