ములుగు ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సేవలు ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ను తెచ్చిపెట్టాయి. కరోనా సమయంలో అడవుల్లో తిరుగుతూ.. గిరిజనులకు సేవ చేసిన సీతక్కపై ప్రశంసల వర్షం కురిసింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఏకంగా సాయుధ బలగాలకే సాయం చేసి నెటిజన్ల మనసు దోచుకున్నారు సీతక్క. అడవుల్లోని గూడెం లలో ఉండే గిరిజనలకు దుప్పట్లు పంచేందుకు వెళ్లిన సీతక్కకు రాత్రి సమయంలో గస్తీ కాస్తున్న సాయుధ బలగాలు ఎదరుపడ్డాయి.
చలికాలం కావడంతో సైనికులు సైతం చలికి ఇబ్బంది పడుతుండడాన్ని గమనించిన సీతక్క వారికి కూడా దుప్పట్లు పంచారు. దీంతో సీతక్క చేస్తున్న సేవలకు మెచ్చిన జవాన్లు ఆమెకు సెల్యూట్ చేస్తూ.. హ్యాట్సాఫ్ మేడమ్ అంటూ గౌరవించారు. కరోనా సమయంలో అడవిలో తిరుగుతూ మీరు చేసిన సేవలు నిజంగా చాలా గొప్పవని కొనియాడారు. చప్పట్లు కొట్టి సీతక్క గొప్పతనాన్ని మెచ్చుకున్నారు.
ఒక ఎమ్మెల్యేగా సీతక్క ఎందరికో స్ఫూర్తిదాయకం అని, ఎన్నికలు లేని సమయంలో కూడా సేవలను మరిచిపోరని ప్రశంసించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2009లో ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క.. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ములుగు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మరి సీతక్క చేస్తున్న సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.