రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా వానాకాలం పంట పెట్టుబడి సాయాన్ని నిన్నటి నుంచి ప్రారంభించింది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమైతున్నాయి.
రైతు కళ్లలో ఆనందం నింపేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నదాతల సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రవేశ పెట్టి రైతులకు అండగా నిలుస్తున్నారు. ఒకప్పుడు పంటలు పండించడానికి నీళ్లు లేక, కరెంటు లేక, పండించిన పంటకు సరియైన గిట్టుబాటు ధర రాక రైతు అల్లాడిపోయేవాడు. సరైన దిగుబడి రాక పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులతో అన్నదాత ఆయువు తీసుకున్న ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సిఎం కెసిఆర్ రైతు కష్టాలను తొలగించి తలెత్తుకుని ఆత్మగౌరవంతో బ్రతికేలా పలు పథకాలను ప్రవేశపెట్టారు.
రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తలచిన సిఎం కెసిఆర్ రైతులకు పంటలు పండించడానికి కావాల్సిన నీళ్లను, ఉచిత కరెంటును, పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతన్న కుటుంబానికి అండగా నిలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో పంటకు పెట్టుబడి అందించేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారు. దీనిలో భాగంగా ఎకరానికి రూ. 5000వేలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ప్రభుత్వం. యాసంగి, వానాకాలం రెండు పంటలకు ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. కాగా రైతుబంధు 11వ విడతకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. నిన్నటి (జూన్ 26) నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్నాయి. రైతుబంధు పథకం కోసం ప్రభుత్వం ఏడు వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తున్నది. సుమారు 70 లక్షల మంది రైతులు లబ్థి పొందుతున్నారు. ఈ దఫా పోడు రైతులకు కూడా రైతుబంధును అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. మరి రైతుబంధు అర్హుల లిస్టులో మీరు ఉన్నారా.. మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి.
*రైతు బంధు అర్హుల జాబితా తెలుసుకునేందుకు అధికారిక వెబ్సైట్ http://rythubandhu.telangana.gov.in ను సందర్శించాలి. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి హోం పేజీలో ఉన్న రైతు బంధు పథకం మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ కింది భాగంలో చెక్ డిస్ట్రిబ్యూషన్ వెన్యూ షెడ్యూల్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. ఆ తరువాతి పేజీలో మీ జిల్లా, మండలంను నమోదు చేసి ఎంటర్ చేస్తే రైతుబంధు లబ్ధిదారుల లిస్ట్ కనిపిస్తుంది. దాంట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
*రైతుబంధు నగదు ఖాతాలో జమ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ పాటించాలి.
తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్ https://treasury.telangana.gov.in ను సందర్శించాలి. ఈ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోం పేజీ మెనూ బార్లో రైతుబంధు పథకం ఖరీఫ్ డీటైయిల్స్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ అడిగిన వివరాలను బట్టి రైతు బంధు అందుకునే సంవత్సరం, టైప్, పిపిబి నెంబర్ నమోదు చేసుకుని సబ్మిట్ చేయాలి. స్కీమ్ వైజ్ రిపోర్ట్ ఎంచుకుని మీ వివరాలు ఇవ్వాలి. వివరాలు మొత్తం నమోదు చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు రైతు బంధు నగదు ఖాతాలో జమైందో లేదో తెలుసుకోవచ్చు.