హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్ ఒకటి. ఇప్పుడీ మల్టీప్లెక్స్ను అధునాతన హంగులతో (రీ లోడ్) తీర్చిదిద్దారు. కరోనా రెండో దశ తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమైన చిత్రాలను ప్రదర్శించడానికి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ సిద్ధమైంది. కొత్త హంగులతో తీర్చిదిద్దిన ఐమాక్స్ మూడో అంతస్తు ప్రాంగణాన్ని ఇవాళ సిబ్బందితో కలిసి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ యజమాని రమేష్ ప్రసాద్ ప్రారంభించారు.
వీకెండ్ వస్తే చాలామంది ఉద్యోగులు ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో సినిమా చూసి, ఆ తర్వాత కాసేపు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో షికారుకు వెళ్లడం భాగ్యనగర ప్రజలకు అలవాటుగా ఉండేది. సరికొత్తగా ముస్తాబయిన స్క్రీన్లు జూలై 30, శుక్రవారం నుండి (అంటే నేటి నుంచీ) ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రమేష్ ప్రసాద్ వెల్లడించారు.
కరోనా తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమైన చిత్రాలను ప్రదర్శించడానికి ప్రసాద్స్ మల్టీప్లెక్స్ సిద్ధమైంది. ఈ మల్టీప్లెక్స్ కట్టిన నాటి నుండి ఇప్పటివరకూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ప్రేక్షకుల కోసం సరికొత్తగా మల్టీప్లెక్స్ ను తీర్చిదిద్దామని ప్రసాద్స్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్ వివరించారు. త్వరలో ఐమాక్స్ తెరను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
తమ గురువూ తండ్రిగారైన ఎల్వీ ప్రసాద్ సినిమానే జీవితంగా బతికారని, దేశంలో ఒక గొప్ప నిర్మాతగా ఎదిగారని, ఆయన పిల్లలుగా సినీ పరిశ్రమకు ఎంత సేవ చేయాలో అంతా చేస్తున్నామని., సినీ రంగంలో ఉండటం చాలా గర్వంగా ఉందని రమేష్ ప్రసాద్ అన్నారు.